ఈ ఏడాదిలోనే లిథియం–అయాన్ బ్యాటరీ సెల్ తయారీని ప్రారంభించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ప్రణాళికలు తాత్కాలికంగా నిలిచిపోయాయని బ్లూమ్బర్గ్ నివేదించింది.బ్యాటరీ సెల్ టెక్నాలజీకి సంబంధించిన లైసెన్సింగ్ కోసం చైనా ఇంధన నిల్వ సంస్థ జియామెన్ హిథియం ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీతో రిలయన్స్ చర్చలు జరిపింది. అయితే, విదేశీ టెక్నాలజీ బదిలీలపై చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో జియామెన్ ఈ భాగస్వామ్యానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు సంస్థల మధ్య చర్చలు నిలిచిపోయాయని బ్లూమ్బర్గ్ తన నివేదికలో పేర్కొంది.దీంతో, రిలయన్స్ ఇప్పుడు బ్యాటరీ సెల్స్ తయారీకి బదులుగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) అసెంబ్లింగ్పై మళ్లీ దృష్టి సారించాలని యోచిస్తున్నట్టు సమాచారం. గత ఏడాది అక్టోబర్లో చైనా లిథియం బ్యాటరీ విడిభాగాల ఎగుమతులపై నియంత్రణలు విధిస్తూ, ఎగుమతిదారులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని ఆదేశించింది.ఈ చర్యలతో ఇంధన నిల్వలు, ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యంత కీలకమైన సాంకేతికతపై చైనా నిబంధనలు మరింత కఠినతరం చేసినట్టయ్యింది. అయితే, ఈ కథనాలపై స్పందించిన రిలయన్స్ సంస్థ బ్యాటరీ సెల్ తయారీ ఆగిపోయిందన్న వార్తలను ఖండించింది.తమ బ్యాటరీ స్టోరేజ్ తయారీ ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు లేవని, అన్ని ప్రాజెక్టులు ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నాయని కంపెనీ స్పష్టం చేసింది. సెల్ తయారీ నుంచి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (ESS) వరకు పూర్తి ఎకోసిస్టమ్ను నిర్మించాలన్న తమ లక్ష్యాలు యథాతథంగా కొనసాగుతాయని, ఎటువంటి ఆలస్యం ఉండదని రిలయన్స్ వెల్లడించింది..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa