ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతి కానుక,,,,ఏపీకి కేంద్రం రూ.567 కోట్లు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 07:43 PM

సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త చెప్పింది. కేంద్రం నుంచి రూ. 567 కోట్ల గ్రాంటు విడుదలైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగానికి కేంద్రం రూ. 567.40 కోట్లు విడుదల చేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


15వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగానికి మొత్తం రూ. 2,600 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసిందని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం ఐదవ మరియు చివరి విడతగా రూ. 567.40 కోట్లు విడుదల చేసిందని, దీంతో రాష్ట్రానికి మంజూరైన మొత్తం నిధులు చేరాయని వివరించారు. గతంలో తమిళనాడు, త్రిపుర వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే తమ ఆరోగ్య రంగ గ్రాంట్లను సకాలంలో పూర్తిగా అందుకున్నాయని, ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ చేరడం ఒక గొప్ప విజయమని ఆయన అన్నారు.


మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇప్పటివరకు రూ. 2,033 కోట్లు విడుదలయ్యాయని, అందులో గత 19 నెలల ఎన్డీఏ పాలనలో రూ. 1,896 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దీనికి సంబంధించిన వినియోగ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపి, మిగిలిన మొత్తాన్ని విడుదల చేయాలని కోరింది. ఆ వివరాలను పరిశీలించిన కేంద్రం, చివరి విడతగా రూ. 567.40 కోట్లను విడుదల చేసి మొత్తం కేటాయింపులను పూర్తి చేసిందని తెలిపారు. ఈ నిధులు సకాలంలో విడుదల కావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈ నిధులు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు.


ఆంధ్రప్రదేశ్ 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తిగా పొందిన ఘనత సాధించిందని మంత్రి తెలిపారు. ఈ నిధులను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణానికి ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. అలాగే రోగ నిర్ధారణ సేవలను మెరుగుపరచడానికి, బ్లాక్ స్థాయిలో ప్రజారోగ్య ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ఈ నిధులు వెచ్చిస్తామని ప్రకటించారు.


ఆరోగ్య శాఖ ప్రస్తుతం 1,467 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనాలు, 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గతంలో ఆలస్యమైన నిర్మాణ పనులు ఇప్పుడు వేగవంతం అయ్యాయని, కేంద్రం ఆమోదించిన అవసరాలకు అనుగుణంగా ఈ నిధులను ఉపయోగిస్తామని వివరించారు.


ఈ నిధులు రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా కొత్త ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, ఉన్నవాటిని ఆధునీకరించడం వల్ల మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa