ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హౌరా-గౌహతి మధ్య పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభించిన ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 06:57 PM

భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ తొలి వందే భారత్ స్లీపర్ సర్వీసు ఆ రాష్ట్రంలోనే ప్రారంభించారు. బెంగాల్‌లోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి (కామాఖ్య) మధ్య ఈ వందే భారత్ స్లీపర్ రైలు నడవనుంది.


ఈ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న వేగవంతమైన రైలు అయిన సరైఘాట్ ఎక్స్‌ప్రెస్ కంటే ఈ వందే భారత్ స్లీపర్ రైలు సుమారు 3 గంటల తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకుంటుంది. హౌరా నుంచి గౌహతి మధ్య ఉన్న 958 కిలోమీటర్ల దూరాన్ని ఈ వందే భారత్ స్లీపర్ కేవలం 14 గంటల్లోనే కవర్ చేస్తుంది. ఈ వందే భారత్ స్లీపర్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం 130 కిలోమీటర్ల వేగంతోనే నడపనున్నారు.


రైలు టైమింగ్స్, కోచ్ వివరాలు


సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు హౌరాలో బయలుదేరనున్న ఈ వందే భారత్ స్లీపర్ రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటల 20 నిమిషాలకు కామాఖ్య స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కామాఖ్యలో సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హౌరాకు చేరుకుంటుంది. హౌరా నుంచి గురువారం తప్ప మిగిలిన 6 రోజులు.. కామాఖ్య నుంచి బుధవారం తప్ప మిగిలిన 6 రోజులు ఈ వందే భారత్ స్లీపర్ రైలు నడుస్తుంది.


ఈ వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉన్నాయి. అందులో 11 ఏసీ 3 టైర్.. 4 ఏసీ 2 టైర్.. 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. ఈ రైలులో ఒకేసారి మొత్తం 823 మంది ప్రయాణించే వీలు ఉంది. ఈ వందే భారత్ స్లీపర్ టికెట్ ధరలు విమాన ప్రయాణంతో పోటీ పడేలా ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. 3 ఏసీ టికెట్ ధర రూ.2,300 కాగా.. 2 ఏసీ రూ.3 వేలు.. ఫస్ట్ ఏసీ రూ.3640గా నిర్ణయించారు. ఈ ధరలకు అదనంగా 5 శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వర్తిస్తుంది. కేవలం కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్నవారిని మాత్రమే ఈ రైలులోకి అనుమతించనున్నారు. RAC లేదా వెయిటింగ్ లిస్ట్ సౌకర్యం లేదు.


వందే భారత్ స్లీపర్ రైలు అత్యాధునిక సౌకర్యాలు


గాలి నాణ్యతను పెంచేందుకు సీల్డ్ గ్యాంగ్‌వేలు, ఆటోమేటిక్ డోర్లు.. శబ్దాలు, కుదుపులు లేని ప్రయాణం కోసం అధునాతన సస్పెన్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు 99 శాతం క్రిములను చంపేసే అత్యాధునిక డిసిన్ఫెక్టెంట్ టెక్నాలజీ.. బయో వాక్యూమ్ టాయిలెట్లు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ కోచ్‌లో వేడి నీటి షవర్ సదుపాయం కూడా ఉంది. ప్రయాణికులకు బెంగాలీ, అస్సామీ రుచులతో కూడిన భోజనాన్ని వడ్డిస్తారు. దేశీయ కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్, ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు అమర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa