అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'బ్రహ్మోస్' క్షిపణి ఒప్పందం ఇప్పుడు ఒక వింతైన చిక్కుముడిలో పడింది. సుమారు 450 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 4000 కోట్ల పైచిలుకు) విలువైన బ్రహ్మోస్ కొనుగోలుకు ఇండోనేషియా సిద్ధమవుతున్న తరుణంలోనే.. జకార్తా ప్రభుత్వం పాకిస్థాన్-చైనా సంయుక్తంగా తయారు చేసిన 'జెఎఫ్-17 థండర్' యుద్ధ విమానాలపై ఆసక్తి చూపడం భారత్ను విస్మయానికి గురిచేస్తోంది.
అసలేమిటీ వివాదం?
గత వారం ఇస్లామాబాద్లో ఇండోనేషియా రక్షణ మంత్రి షాఫ్రీ షామ్సోద్దీన్, పాకిస్థాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి భేటీ ఈ చర్చకు కారణమైంది. ఈ సమావేశంలో పాకిస్థాన్ సుమారు 40 జెఎఫ్-17 యుద్ధ విమానాలను ఇండోనేషియాకు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో పాటు పాక్ తయారీ డ్రోన్లను కూడా కొనాలని ఇండోనేషియా భావిస్తుండటం భారత రక్షణ శాఖలో కలకలం రేపుతోంది.
దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును అడ్డుకోవడానికి ఇండోనేషియాకు బ్రహ్మోస్ క్షిపణులు అత్యంత అవసరం. గతేడాది భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో 'ఆపరేషన్ సిందూర్' ద్వారా భారత్ 15 బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ ఎయిర్ బేస్లను పూర్తిగా నాశనం చేసింది. ఆ క్షిపణి సామర్థ్యాన్ని చూసిన ఇండోనేషియా ఈ డీల్కు మొగ్గు చూపింది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ను వినియోగిస్తుండగా.. ఇండోనేషియా రెండో దేశంగా నిలవనుంది.
జేఎఫ్-17 యుద్ధ విమానాలపై బంగ్లాదేశ్కూ ఆసక్తి..
వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న ఇండోనేషియా.. ఒకవైపు భారత్ నుంచి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులను కొంటూనే మరోవైపు భారత్ శత్రుదేశమైన పాకిస్థాన్తో రక్షణ ఒప్పందాలు చేసుకోవడం దౌత్యపరమైన 'మిస్ ఫైర్' అని నిపుణులు భావిస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేవలం ఇండోనేషియా మాత్రమే కాదు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కూడా ఈ జెఎఫ్-17 విమానాలపై ఆసక్తి చూపుతుండటం గమనార్హం.
7 ఏళ్లుగా ఒంటి కాలిపైనే.. అన్ని అదే పొజిషన్లోనే
ప్రస్తుతం బ్రహ్మోస్ డీల్కు సంబంధించిన చర్చలన్నీ పూర్తి అయ్యాయి. రష్యా భాగస్వామ్యం ఉన్న క్షిపణి కావడంతో.. కేవలం మాస్కో నుంచి లాంఛనప్రాయ అనుమతి రావాల్సి ఉంది. 2025 రిపబ్లిక్ డే వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు ఈ ఒప్పందం వేగవంతమైంది. అయితే ఇప్పుడు పాక్ విమానాల కొనుగోలు అంశం బ్రహ్మోస్ డీల్పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa