తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25న తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారు ఏడు వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఏడు వాహన సేవలు జరగనున్నాయి. వాహన సేవల సందర్భంగా శ్రీవారు మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. మరోవైపు మాఘ మాసంలో వచ్చే.. శుక్ల పక్ష సప్తమి తిథిని రథసప్తమి అని.. అలాగే మాఘ సప్తమి అని పిలుస్తూ ఉంటారు.
ఈ రోజు సూర్యదేవుడు జన్మించాడని.. ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాలు చెప్తున్నాయి. ఇంతటి పవిత్రమైన రథసప్తమిని పురస్కరించుకుని టీటీడీ మినీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంది. అంటే శ్రీవారి వాహన సేవలు అన్నీ కూడా ఒకే రోజు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రథసప్తమి రోజు తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటూ ఉంటారు. ఒకే రోజు వాహన సేవలు చూడవచ్చనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.
రథసప్తమి రోజున తిరుమలలో వాహన సేవల వివరాలు
ఉదయం 5:30 - 8:00 వరకూ - సూర్యప్రభ వాహనం
ఉదయం 9 -10 వరకూ - చిన్న శేష వాహనం
ఉదయం 11-12 వరకూ - గరుడ వాహనం
మధ్యాహ్నం 1-2 వరకూ - హనుమంత వాహనం
మధ్యాహ్నం 2-3 వరకూ - చక్రస్నానం
సాయంత్రం 4- 5 వరకూ - కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6-7 వరకూ - సర్వభూపాల వాహనం
రాత్రి 8-9 వరకూ- చంద్రప్రభ వాహనం
మరోవైపు రథసప్తమి వాహన సేవల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 25వ తేదీ ఆర్జిత సేవలు రద్దు చేశారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంతో పాటుగా సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రబాతం, తోమాల, అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు.
పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
మరోవైపు జనవరి 20వ తేదీన తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జనవరి 25వ తేదీ రథసప్తమి నిర్వహిస్తారు. ఈ సందర్భంగానే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 6.30 నుంచి ఉదయం 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa