ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌కు సెనేటర్ల లేఖ.. భారత్ 30 శాతం సుంకాలపై రగడ!

national |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 08:10 PM

భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో పప్పుధాన్యాల వివాదం కొత్త ఉత్కంఠను రేపుతోంది. అమెరికా పప్పుధాన్యాలపై భారత్ విధిస్తున్న 30 శాతం దిగుమతి సుంకాన్ని తొలగించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ఇద్దరు అమెరికన్ సెనేటర్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు భారత్, అమెరికా మధ్య కుదరబోతున్న కీలక వాణిజ్య ఒప్పందానికి ఈ పప్పుధాన్యాలు అడ్డంకిగా మారేలా కనిపిస్తున్నాయి.


అమెరికాలోని ప్రధాన పప్పుధాన్యాల ఉత్పత్తి రాష్ట్రాలైన నార్త్ డకోటా, మోంటానాలకు చెందిన సెనేటర్లు కెవిన్ క్రామర్, స్టీవ్ డైన్స్.. ట్రంప్‌కు ఇటీవల ఒక లేఖ రాశారు. అమెరికా నుంచి ఎగుమతి అయ్యే పప్పుధాన్యాలపై భారత్ విధిస్తున్న 30 శాతం సుంకం అన్యాయమని.. దీనివల్ల అమెరికా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


గతేడాది ట్రంప్ సర్కార్ భారత ఉత్పత్తులపై 50 శాతం భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిచర్యగా భారత్ కూడా నవంబర్ 1వ తేదీ నుంచి అమెరికా పప్పు ధాన్యాలపై 30 శాతం సుంకాన్ని అమలులోకి తెచ్చింది. నిజానికి 2026 మార్చి వరకు ఈ దిగుమతులపై ఎటువంటి సుంకాలు ఉండవని భారత్ గతంలో ప్రకటించినప్పటికీ.. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.


ప్రపంచ పప్పుధాన్యాల వినియోగంలో భారత్ వాటా దాదాపు 27 శాతం కావడం గమనార్హంఅమెరికా రైతులకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అందుకే, ప్రధాని మోదీతో నేరుగా చర్చించి ఈ సుంకాలను తగ్గించేలా చూడాలని సెనేటర్లు ట్రంప్‌ను కోరారు. 2020లో కూడా ట్రంప్ తన భారత పర్యటనలో ఇలాగే పప్పుధాన్యాల రైతుల సమస్యను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారని వారు గుర్తు చేశారు.


ట్రేడ్ డీల్‌పై ప్రభావం


సుంకాలు, ప్రతి సుంకాలతో భారత్ అమెరికా మధ్య గత కొన్ని నెలలుగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పరిస్థితి ఇప్పుడిప్పుడే సద్ధుమణుగుతోంది. ఒకవైపు వాణిజ్య ఒప్పందం కొలిక్కి వస్తుందని భావిస్తున్న తరుణంలో.. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ యాక్సెస్ కోరడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడటం తమకు అత్యంత కీలకమని ఇప్పటికే ప్రధాని మోదీ తేల్చి చెప్పిన తరుణంలో.. ఈ పప్పు పాలిటిక్స్ వివాదం యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్‌ను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa