ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్గిల్ తరహాలో జైషే ఉగ్రవాదుల బంకర్.. 12 వేల అడుగుల ఎత్తులో

national |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 10:27 PM

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాల పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదుల మనుగడ సాగించేందుకు ఏర్పాటు చేసుకున్న పద్ధతులను చూసి భద్రతా బలగాలే ఆశ్చర్యపోతున్నాయి. సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో.. గడ్డకట్టే చలిలో కూడా నెలల తరబడి నివసించేలా జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ముష్కరులు.. ఒక రహస్య కోటను నిర్మించుకున్నారు. రాళ్లు, కాంక్రీటుతో నిర్మించిన ఈ కార్గిల్ తరహా బంకర్‌ను సోమవారం భద్రతా బలగాలు గుర్తించి.. పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్‌లో కొందరు ఉగ్రవాదులు పారిపోగా.. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్‌తో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


బంకర్‌లో దొరికిన నిల్వలు


చలికాలం మొత్తం బయటకు రాకుండా బంకర్ లోపలే గడిపేలా ఉగ్రవాదులు భారీగా ఆహార నిల్వలను సిద్ధం చేసుకున్నారు. బంకర్‌ను సోదా చేయగా.. 50 మ్యాగీ ప్యాకెట్లు, 20 కిలోల బాస్మతి బియ్యం, 15 రకాల మసాలాలు, టమోటాలు, ఆలుగడ్డలు వంటి తాజా కూరగాయలు దొరికాయి. వంట గ్యాస్, పొయ్యి, గిన్నెలు, చలి కాచుకోవడానికి ఎండు కలపను కూడా ఉగ్రవాదులు అక్కడ పోగు చేసుకున్నట్లు భద్రతా బలగాల తనిఖీల్లో వెల్లడైంది.


 ఆదివారం మధ్యాహ్నం ఆ బంకర్‌ను గుర్తించిన భద్రతా బలగాలు దాన్ని చుట్టుముట్టిన సమయంలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఒక్కసారిగా వారిపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది సైనికులు గాయపడగా.. వారిలో ఉత్తరాఖండ్‌కు చెందిన స్పెషల్ ఫోర్స్ పారాట్రూపర్ హవల్దార్ గజేంద్ర సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆయనను చికిత్స కోసం తరలించగా.. ఆస్పత్రిలోనే సోమవారం వీరమరణం పొందారు. ఉగ్రవాదులు చీకటిని ఆసరాగా చేసుకుని పక్కనే ఉన్న దట్టమైన అడవుల్లోకి పారిపోయినట్లు సైన్యం తెలిపింది. పరారీలో ఉన్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు సైనికులు.. ఆ ప్రాంతం మొత్తం జల్లెడ పడుతున్నారు.


లోకల్ నెట్‌వర్క్ పై కన్ను


12 వేల అడుగుల ఎత్తులో అన్ని రకాల సదుపాయాలతో బంకర్ నిర్మించారంటే స్థానికుల సహకారం లేకుండా సాధ్యం కాదని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో నలుగురు స్థానికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాకిస్తాన్ మూలాలు ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కమాండర్లు సైఫుల్లా, ఆదిల్‌లు ఆ ప్రాంతంలో నక్కి ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎలాంటి దాడులకు పాల్పడకుండా సరిహద్దుల్లో ఆపరేషన్ త్రాషి-Iను భారత సైన్యం మరింత ముమ్మరం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa