ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీరల కోసం ఉదయం 4 గంటల నుంచి మహిళల క్యూ.. ఒక్కోటి రూ. 2.50 లక్షలు

national |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 10:30 PM

కర్ణాటకలోని మైసూర్ సిల్క్ చీరలకు 2026లోనూ విపరీతమైన డిమాండ్ కొనసాగుతోంది. ఒక్క చీర కోసమే మహిళలు తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూ కడుతున్నారు. ప్రైవేట్ మార్కెట్లో నకిలీ పట్టు విక్రయాలు జరుగుతుండటంతో.. జీఐ ట్యాగ్ ఉన్న స్వచ్ఛమైన ఈ మైసూర్ సిల్క్ చీరలు కొనేందుకు ఎగబడుతున్నారు. అయితే ఒక్కో చీర ఖరీదు గరిష్ఠంగా రూ.2.50 లక్షలకు విక్రయిస్తున్నా.. మహిళలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నైపుణ్యం కలిగిన నేత కార్మికుల కొరత కారణంగా సిల్క్ చీరలు ఉత్పత్తి చేయడం తగ్గిపోయి.. షోరూమ్‌ల వద్ద తీవ్ర కొరత ఏర్పడిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (కేఎస్ఐసీ) షోరూమ్‌ల ముందు తెల్లవారుజాము నుంచే మహిళలు క్యూ కట్టడం ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే కాదు.. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. చీర కోసం గంటల తరబడి వేచి చూడటం.. కేవలం ఒకే ఒక చీర కొనే అవకాశం ఉండటం మైసూర్ సిల్క్ పట్ల ఉన్న విపరీతమైన క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.


  అయితే ఆ షోరూమ్‌లో ఒక్క మైసూర్ సిల్క్ చీర ప్రారంభ ధర రూ.23 వేలు కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఆ చీర జరి పనితనాన్ని బట్టి గరిష్ఠంగా ఒక్కో చీర ఏకంగా రూ.2.50 లక్షలు పలుకుతోంది. అయినప్పటికీ ఆ మైసూర్ సిల్క్ చీరలు కొనుగోలు చేసేందుకు.. కన్నడ మహిళలు తెల్లవారుజామునుంచే ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ఒక్కో కస్టమర్‌కు కేవలం ఒకటే చీర ఇస్తామని కండిషన్ పెట్టారు. దానికోసం ముందుగా టోకెన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ తయారు చేసే చీరలకు జీఐ ట్యాగ్ (జియోగ్రఫికల్ ఇండికేషన్) ఉంది. అంటే ఇవి 100 శాతం స్వచ్ఛమైన పట్టు, వెండి లేదా బంగారు జరితో తయారు చేస్తారు.


మైసూరు సిల్క్ చీరల కొరతకు కారణాలు


నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఈ మైసూరు సిల్క్ చీరలను నేసే నేత కళాకారులు చాలా తక్కువ మంది ఉన్నారు. కొత్తగా చేరిన వారికి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడానికి కనీసం 6 నుంచి 7 నెలల సమయం పడుతుంది. దీంతోపాటు చీర నాణ్యత ఏ మాత్రం తగ్గకుండా ఉండటం కోసం కేఎస్ఐసీ కేవలం తన సొంత యూనిట్లలో మాత్రమే ఈ మైసూరు సిల్క్ చీరలను ఉత్పత్తి చేస్తోంది. 2025లో ఈ చీరల ఉత్పత్తిని పెంచినప్పటికీ.. డిమాండ్‌తో పోలిస్తే అది చాలా తక్కువగా ఉండటంతో కొరత కొనసాగుతోంది. గత 2, 3 ఏళ్లలో సోషల్ మీడియా ద్వారా మైసూర్ సిల్క్ చీరల ప్రాచుర్యం బాగా పెరిగింది. దీంతో మునుపెన్నడూ లేని విధంగా ఈ చీరలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.


మైసూర్ సిల్క్ పేరుతో మార్కెట్లో చైనీస్ సిల్క్ లేదా నకిలీ పట్టు విక్రయాలు బాగా పెరుగుతుండటంతో.. అసలు సిల్క్ చీరలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇటీవల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో ఒక కాంట్రాక్టర్ సుమారు రూ.54 కోట్ల విలువైన నకిలీ పట్టు దుపట్టాలను సరఫరా చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2015 నుంచి 2025 వరకు ఈ మోసం కొనసాగింది. అందుకే ఇప్పుడు స్వచ్ఛమైన సిల్క్ చీరల కోసం కేఎస్ఐసీ షోరూమ్‌ల వద్దే క్యూ కడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa