గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలతో పాటు.. సైనిక పురస్కారాలను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా 21వ పారా స్పెషల్ ఫోర్స్కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఘటాగె ఆదిత్య శ్రీకుమార్కు.. కేంద్రం ‘శౌర్యచక్ర’ అవార్డును ప్రకటించింది. అయితే మయన్మార్ భూభాగంలో గతేడాది భారత్ ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. ఇండో- మయన్మార్ సరిహద్దులో మిలిటెంట్ల స్థావరం లక్ష్యంగా కోవర్ట్ ఆపరేషన్ను నిర్వహించింది. తాజాగా ‘శౌర్యచక్ర’ పురస్కారం ప్రకటనతో స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో హింట్ ఇచ్చినట్లు అయింది. అయితే ఇలాంటి ఆపరేషన్ల గురించి సాధారణంగా ప్రభుత్వాలు వెల్లడించవు. కేంద్రం కూడా దేశవ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
మయన్మార్లో మిలిటెంట్ల స్థావరాన్ని అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసేలా ప్లాన్ చేసినందుకు, ముందుండి నడిపించినందుకు ఆదిత్య శ్రీకుమార్కు ఈ పురస్కారం దక్కింది. అయితే ఈ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం చెప్పలేదు. 2025 జులై 11 నుంచి జులై 13 వరకు భారత్- మయన్మార్ బార్డర్లో ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కోవర్ట్ ఆపరేషన్లో 9 మంది మిలిటెంట్లు మృతి చెందినట్లు సమాచారం.
మయన్మార్లోని సగైంగ్ ప్రాంతంలో జరిపిన డ్రోన్లు, క్షిపణి దాడుల్లో తమ సంస్థకు చెందిన అగ్ర నాయకులు మరణించినట్లు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఇండిపెండెంట్) లేదా (Ulfa (I)) ప్రకటించింది. భారత ఆర్మీనే ఈ దాడి చేసిందని అప్పట్లో ఆ సంస్థ ఆరోపణలు చేసింది. అయితే తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఇక అస్సాం పోలీసులు కూడా ఎలాంటి దాడులు చేయలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు.
కాగా, భారత్ - మయన్మార్ మధ్య దాదాపు 1600 కిలోమీటర్ల మేర బార్డర్ ఉంది. అయితే సాయుధ పోరాటం ద్వారా స్వతంత్ర అస్సాంను సాకారం చేయడానికి గత కొన్నేళ్లుగా ఉల్ఫా(ఐ) మిలిటెంట్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ సరిహద్దు ప్రాంతం నుంచి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కోవర్ట్ ఆపరేషన్ చేసి.. మిలిటెంట్ సంస్థ శిబిరాలు ధ్వంసం చేసినట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం ఈ ఆపరేషన్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ దేశ వ్యతిరేక సంస్థల క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa