ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిల్పా శెట్టి కొత్త రెస్టారెంట్.. ఫ్రీగా టిఫిన్స్.. కిలోమీటర్ల మేర క్యూకట్టిన జనం

national |  Suryaa Desk  | Published : Tue, Jan 27, 2026, 07:27 PM

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఇటీవల ముంబైలోని బాంద్రాలో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. 'అమ్మకాయ్' పేరుతో పెట్టిన ఆ రెస్టారెంట్‌లో ఉచిత బ్రేక్‌ఫాస్ట్ ఆఫర్ పెట్టడంతో బాంద్రా రోడ్లపై జనం బారులు తీరారు. సాధారణంగా ముంబై బాంద్రా అంటేనే ధనికులు ఉండే ప్రాంతం. అయితే అలాంటి ప్రాంతంలో ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ అనగానే వందల మంది ఎగబడటం.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా.. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఉచిత భోజనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచితాల పట్ల ప్రజల్లో ఉన్న అతి వ్యామోహం దేశ పురోగతికి ఆటంకమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.


అసలేం జరిగింది?


బాంద్రాలోని శిల్పా శెట్టి కొత్త రెస్టారెంట్‌లో ఎవరు ముందు వస్తే వారికి ప్రాధాన్యత అంటూ.. ఉచిత బ్రేక్‌ఫాస్ట్ ఆఫర్‌ను ప్రకటించింది. రెస్టారెంట్ ఉదయం 9 గంటలకు ఓపెన్ చేయనుండగా.. ఉదయం 7 గంటల నుంచే వందలాది మంది ప్రజలు రోడ్లపై బారులు తీరారు.


నెటిజన్ల ఆగ్రహం


ఈ క్యూలో నిలబడిన వారి ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. క్యూలో ఉన్న వారిని చూస్తే ఎవరూ పేదవారులా లేరని.. కనీసం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల విలువైన ఫ్లాట్లలో నివసించే వారు కూడా కేవలం ఒక ప్లేట్ ఉచిత టిఫిన్ కోసం గంటల తరబడి రోడ్డుపై వేచి ఉండటం సిగ్గుచేటని కొందరు మండిపడుతున్నారు.


ఉచితంగా ఏది వచ్చినా వదులుకోకూడదనే మనస్తత్వం వల్ల ప్రజలు తమ గౌరవాన్ని, నైతికతను పక్కన పెడుతున్నారని పోస్టులు కనిపిస్తున్నాయి. మనం ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలను విమర్శిస్తాం కానీ.. మన వ్యక్తిగత ప్రవర్తన కూడా అలాగే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆలోచన విధానం మారనంత కాలం దేశం బాగుపడదు అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉచితాలు అంటూ ఎగబడిపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa