ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మీ వాట్సాప్ చాటింగ్ అంతా మెటా చూస్తోంది?':.. మస్క్ ఏమన్నారంటే?

international |  Suryaa Desk  | Published : Wed, Jan 28, 2026, 09:18 PM

వాట్సాప్‌లో మన వ్యక్తిగత సంభాషణలు ఎంత వరకు భద్రం? మనం పంపే మెసేజ్‌లు కేవలం మనకు, అవతలి వారికి మాత్రమే కనిపిస్తాయన్న వాట్సాప్ హామీ నిజమేనా? ఈ ప్రశ్నలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గర్వంగా చెప్పుకునే 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్' ఫీచర్ కేవలం ఒక బూటకమని, మెటా సంస్థ వినియోగదారుల ప్రైవేట్ చాట్‌లను గుట్టుచప్పుడు కాకుండా చూస్తోందని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో భారీ దావా నమోదైంది. దీంతో అందరి కన్ను వాట్సాప్ సంస్థపై పడగా.. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. మరేం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందామా?


ఎన్‌క్రిప్షన్ కేవలం ఓ నాటకమా?


శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దాఖలైన 51 పేజీల ఈ దావాలో.. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, మెక్సికోకు చెందిన అంతర్జాతీయ వినియోగదారులు వాట్సాప్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. వాట్సాప్ భద్రత కేవలం పేరుకేనని, మెటా ఇంజినీర్లు వినియోగదారుల వ్యక్తిగత సందేశాలను సులభంగా యాక్సెస్ చేయగలరని చెబుతున్నారు. సాధారణంగా ఎన్‌క్రిప్షన్ అంటే సందేశాలను పంపే వారు, స్వీకరించే వారు తప్ప మూడో వ్యక్తి (కంపెనీతో సహా) చదవలేరు. కానీ ఒక చిన్న 'టాస్క్' రిక్వెస్ట్ పంపడం ద్వారా మెటా ఉద్యోగులు ఏ వినియోగదారుడి మెసేజ్‌లైనా చూడవచ్చని పిటిషనర్లు ఆరోపించారు.


ఈ ఆరోపణల్లో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. వినియోగదారులు తమ ఫోన్లలో డిలీట్ చేసిన మెసేజ్‌లను కూడా మెటా యాక్సెస్ చేస్తోందని చెప్పడం . ఒక ప్రత్యేక 'విడ్జెట్' ద్వారా యూజర్ల మెసేజ్‌లు రియల్ టైమ్‌లో కంపెనీ ఉద్యోగులకు కనిపిస్తాయని, దీనికి ఎలాంటి కాల పరిమితి లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలు నిజమని చూపేందుకు వారి ఎలాంటి సాంకేతిక ఆధారాలను కోర్టుకు చూపలేదు.


అవన్నీ అసంబద్ధమైన ఆరోపణలు..


దీంతో ఈ పరిణామాలపై మెటా తీవ్రంగా స్పందించింది. పిటిషనర్లు చేస్తున్న వాదనలు అవాస్తవాలని, పూర్తిగా అసంబద్ధమైనవని కొట్టి పారేసింది. వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ స్పందిస్తూ.. కేవలం వార్తల్లో కనిపించేందుకు మాత్రమే పలువురు ఇలాంటి పనికిమాలిన ఆరోపణలతో కోర్టులో కేసు వేశారని మండిపడ్డారు. వాట్సాప్ భద్రత, ప్రైవసీ విషయంలో తాము ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామని స్పష్టం చేశారు.


ఈ వివాదం నడుస్తుండగానే.. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ తనదైన స్టైల్‌లో స్పందించారు. "వాట్సాప్ అస్సలు సురక్షితం కాదు" అని వ్యాఖ్యానించిన మస్క్.. చివరికి 'సిగ్నల్' యాప్ భద్రతపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తన సొంత ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో తీసుకొచ్చిన 'ఎక్స్ చాట్'ను వాడాలని ఆయన యూజర్లకు సూచించారు. ఓవైపు వాట్సాప్ తనది అత్యున్నత భద్రత అని చెబుతుంటే.. మరోవైపు ఇలాంటి కేసులు వినియోగదారులలో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. మరి కోర్టు విచారణలో ఏం తేలుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa