ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబద్దపు పునాదుల మీద చంద్రబాబు బ్రతుకుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 30, 2026, 04:07 PM

ప్రపంచంలో కోట్లాది మంది పూజించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పవిత్ర ప్రసాదంపైన చంద్రబాబు నీచమైన అబద్దపు ప్రచారాలు చేశారని, సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఛార్జ్‌షీట్‌ తేల్చి చెప్పిందని వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడించారు. దేవుడి పేరుతోనూ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, ఇలా ఎంతకాలం అబద్ధాలు చెబుతూ వాటి పునాదుల మీద బతుకుతారని ఆమె చురకలంటించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడితోనూ వారంతా నీచ రాజకీయం చేస్తున్నారన్న ఆమె, అసలు బోలే బాబా డెయిరీకి పర్మిషన్‌ ఇచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. పవిత్ర తిరుమల లడ్డూపైనా విషం చిమ్మిన చంద్రబాబుకు, అలా కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బ తీయటానికి సిగ్గు లేదా? అని నిలదీశారు. తిరుమల ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని నాడు మాట్లాడిన చంద్రబాబు, సిట్‌ ఛార్జ్‌షీట్‌ తర్వాత జనం ముందుకు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యి మీద దుష్ప్రచారం చేసి కోట్లాది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ దెబ్బ తీశారని, అందువల్ల వారి పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa