ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగ్గురు భార్యలను మోసం చేసి, నాలుగో వివాహానికి సిద్ధమైన కేటుగాడు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 09:33 PM

పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు.. కానీ ఈ కిలాడీ భర్తకు మాత్రం అది కాసుల పంట. కట్నం కోసం కక్కుర్తి పడి.. ఆరేళ్ల వ్యవధిలోనే ముగ్గురు అమాయక మహిళల మెడలో తాళి కట్టి, కట్నం డబ్బులు దొబ్బేసి మరీ వారిని వదిలేశాడు. ముఖ్యంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆపై ఇంటికి తీసుకొచ్చి అదనపు కట్నం కోసం వేధించడం, అందులోనూ వారు ఇవ్వలేనంత డిమాండ్ చేసి.. వారిని పుట్టింటికి పంపించడం చేసేవాడు. అక్కడితో ఆగకుండా విడాకుల నోటీసులు పంపించి వారికి నరకం చూపించేవాడు. ఆపై మరో పెళ్లి చేసుకుని మోసాలను కొనసాగించాడు. తాజాగా నాలుగో అమ్మాయిని చేసుకోబోతున్నట్లు తెలుసుకున్న.. ముగ్గురు భార్యలూ పోలీసులను ఆశ్రయించారు. అసలు విషయం చెప్పి అతడిని అరెస్ట్ చేయించారు.


అసలేం జరిగిందంటే..?


ఉత్తర ప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాకు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి ఈ మ్యారేజ్ స్కామ్‌కు సూత్రధారి. ఇతని తండ్రి రైల్వేలో పని చేస్తుండగా.. సునీల్‌కు మాత్రం ఎలాంటి స్థిరమైన ఉద్యోగం లేదు. అయినప్పటికీ పెళ్లిని ఒక వ్యాపారంగా మార్చుకున్న ఇతడు.. 2019 నుంచి 2023 వరకు ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. ప్రతి పెళ్లి సమయంలోనూ అంతకుముందు జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని దాచి పెట్టి, కన్నెపిల్లల తల్లిదండ్రులను నమ్మించి బుట్టలో వేసుకునేవాడు. పెద్ద ఎత్తున కట్నం తీసుకుంటూ.. వారిని ఎలాగోలా వదిలించుకునేవాడు.


మొదటి పెళ్లి జరిగింది అప్పుడే..!


2019లో మొదటిసారి సునీల్ కుమార్ వివాహం చేసుకున్నాడు. అయితే బాధితురాలి కుటుంబం నుంచి 5 లక్షల రూపాయల విలువు చేసే నగలను కట్నంగా పొందాడు. ఇక పెళ్లి కోసం మరో మూడు లక్షలు ఖర్చు చేశారు. మొదట్లో బాగానే ఉన్నా.. పెళ్లయిన కొద్ది రోజులకే సునీల్ అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమెను పుట్టింటికి పంపేశాడు. ఆపై ఆమెకు విడాకుల నోటీసులు పంపించి ఆమె ముఖం కూడా చూడకుండా చేశాడు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో ఉంది. అయితే మొదటి భార్య విషయం దాచిపెట్టి.. 2021లో ఇతడు మరో వివాహం చేసుకున్నాడు. ఈమె వద్ద నుంచి కూడా రూ. 8 లక్షలు గుంజాడు. అదనంగా బుల్లెట్ బైక్, బంగారు చైన్ కావాలని వేధించి.. నిరాకరించడంతో కొట్టి బయటకు పంపేశాడు.


ఆపై రెండేళ్లకు అంటే 2023లో మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆ భార్య గర్భవతిగా ఉన్న సమయంలోనే వేధింపులకు గురిచేసి ఇంట్లోంచి గెంటేశాడు. ప్రస్తుతం ఈమెకు ఒక ఆడబిడ్డ ఉంది. అయితే సునీల్ తాజాగా నాలుగో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి ముగ్గురు భార్యలూ ఏకమయ్యారు. అతడిని ఎలాగైనా శిక్షించాలని నిర్ణయించుకుని నేరుగా ఝాన్సీ ఎస్ఎస్పీ వెళ్లారు. తమ ముగ్గురినీ డబ్బులు కోసం మాత్రమే పెళ్లి చేసుకుని, ఆపై కొన్నిరోజులకే వదిలించుకున్న సునీల్‌పై ఫిర్యాదు చేశారు. త్వరలోనే అతడు నాలుగో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడంటూ వివరించగా.. పోలీసులు అతడిపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa