ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నారు. ప్రభుత్వ పాలనలో సాంకేతికత వినియోగానికి పెద్దపీట వేస్తున్న చంద్రబాబు.. అదే టెక్నాలజీ సాయంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనే దానిపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో పాటుగా సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు ఏ మేరకు చేరుతోంది.. ప్రజలలో సంతృప్త స్థాయి ఎంతమేరకు ఉందనే దానిపై చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ ఉంటారు.
అలాగే ఎమ్మెల్యేల పనితీరుపైనా.. నియోజకవర్గంలో ప్రజలకు, కార్యకర్తలకు ఎంత మేరకు అందుబాటులో ఉంటున్నారనే దానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది. పర్యవేక్షణ మాత్రమే కాదు.. వెనుకబడిన ఎమ్మెల్యేలకు సూచనలు, మందలింపులు కూడా ఉంటాయి. ఇటీవలే ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు కూడా నిర్వహించారు చంద్రబాబు.. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో ఎక్కువమంది తొలిసారిగా శాసనసభ్యులైన వారే ఉన్న కారణంగా.. వారికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ వస్తున్నారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం నియోజకవర్గాలకు ర్యాంకులు కేటాయించింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వివిధ అంశాలను ప్రాతిపదికన తీసుకుని నియోజకవర్గాలకు ర్యాంకులు కేటాయించారు. ప్రతి నియోజకవర్గానికి మార్కులతో పాటుగా.. A+, A, B గ్రేడులుగా అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించారు. శాసనసభ్యుల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు, ఫైళ్ల క్లియరెన్స్, గతంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు ఇలాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేల వివరాలను తాజాగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో A+ కేటగిరిలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు చోటు దక్కింది. A గ్రేడులో 153 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. B గ్రేడులో ఒకే ఒక్క నియోజకవర్గం ఉంది. ఈ క్రమంలోనే 93 శాతం మార్కులు సాధించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీజేపీ నేత సుజనా చౌదరి ఉన్నారు. ఇక 92 శాతం మార్కులతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాక నియోజకవర్గం నిలిచింది. కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం మూడో స్థానంలో నిలవగా.. విజయవాడ తూర్పు నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచేలా పనిచేయాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు నిలిచారు. తాజాగా పనితీరు విషయంలో ఆయన నియోజకవర్గం రెండో స్థానంలో ఉండటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa