ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 09:49 PM

భారత గగనతల రక్షణ కవచం మరింత పటిష్టం కాబోతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఢిల్లీ పర్యటనకు ముందే.. భారత రక్షణ శాఖ ఒక చారిత్రక నిర్ణయానికి సిద్ధమైంది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో.. 114 రఫేల్ మల్టీ రోల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఈ వారంలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే భారత రక్షణ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఆయుధ ఒప్పందంగా మారుతుంది.


'మేక్ ఇన్ ఇండియా'కు భారీ ఊతం


ఈ ఒప్పందం ప్రకారం.. 114 విమానాల్లో సుమారు 100 విమానాలను భారత్‌లోనే తయారు చేస్తారు. దీని కోసం ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్, భారతీయ దిగ్గజం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరినిట్లు సమాచారం. అత్యాధునిక యుద్ధ విమానాల సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు బదిలీ చేయడంతో పాటు హైదరాబాద్‌లో వీటి విడిభాగాల తయారీ కోసం ఒక అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఇదే కనుక జరిగితే 2028 నాటికి ఇక్కడి నుంచే మొదటి ఫ్యూజ్‌లేజ్ (విమాన మధ్య భాగం) సిద్ధం కానుంది.


ముఖ్యంగా టాటా-డస్సాల్ట్ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లోని ప్లాంట్‌లో విమానం వెనుక భాగం, సెంట్రల్ ఫ్యూజ్‌లేజ్ ముందు భాగాలను తయారు చేస్తారు. నెలకు రెండు పూర్తి స్థాయి ఫ్యూజ్‌లేజ్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుది అసెంబ్లీ మాత్రం ఫ్రాన్స్‌లోని మెరిగ్నాక్ ప్లాంట్‌లో జరుగుతుంది. ఈ భారీ ఒప్పందం పూర్తయితే.. ఫ్రాన్స్ వెలుపల రాఫెల్‌ను అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశంగా భారత్ అవతరిస్తుంది.


రఫేల్ కేవలం విమానం కాదు.. అది ఒక ఎగిరే మారణాయుధం. ఇప్పటికే భారత వాయుసేన వద్ద ఉన్న 36 విమానాలు.. గతేడాది ఆపరేషన్ సిందూర్‌లో తమ సత్తాను చాటాయి. అయితే ఇది స్కాల్ప్ క్రూయిజ్ మిస్సైల్స్, మెటియోర్ గగనతల క్షిపణులు, హ్యామర్ వంటి అత్యాధునిక ఆయుధాలను మోసుకెళ్లగలదు. అంతేకాకుండా 250 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువుల స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో నేలమట్టం చేయగలదు. అందుకే వీటికి ఇంత డిమాండ్. ఇప్పటికే భారత్.. నావికా దళం కోసం మరో 26 రఫేల్-M విమానాలను రూ.63,000 కోట్లతో ఆర్డర్ చేసింది. అయితే ఇవి ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్య యుద్ధనౌకల నుంచి సేవలు అందించనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa