లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన ఒక పోక్సో కేసులో బాంబే హైకోర్టు అసాధారణ తీర్పు వెలువరించింది. పూణెకు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్తపై నమోదైన కేసును కొట్టివేస్తూ అతడికి రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తంతో బాధితురాలైన 17 ఏళ్ల బాలికకు ఆమె చదువుకు ఉపయోగపడేలా అత్యాధునిక మ్యాక్బుక్ లేదా మరో మంచి ల్యాప్టాప్ కొనివ్వాలని ఆదేశించింది.2024 ఆగస్టులో 11వ తరగతి చదువుతున్న బాలిక తన మేనమామపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్కూల్కు కారులో తీసుకెళ్లేటప్పుడు తన బాయ్ఫ్రెండ్గా ఉంటావా? అని అడిగాడని, తర్వాత తరచూ మెసేజ్లు పంపేవాడని ఆరోపించింది. కిరాణా సామాను కోసం వెళ్లినప్పుడు "ఐ లవ్ యూ" చెప్పి, ముద్దు అడిగి, తన ఛాతీపై అసభ్యంగా తాకాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని మొదట స్కూల్ కౌన్సిలర్కు, ఆ తర్వాత నానమ్మకు చెప్పడంతో ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదైంది.అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా అనూహ్య మలుపు తిరిగింది. ఇదంతా కేవలం ఒక అపార్థం వల్లే జరిగిందని, ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిరిందని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టులో హాజరైన బాలిక, ఆమె తల్లిదండ్రులు కూడా దీన్ని అంగీకరించారు. కేసును ఇకపై కొనసాగించడం తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.బాధితురాలి వాదనను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఆర్.ఆర్.భోంస్లే నేతృత్వంలోని ధర్మాసనం, కేసు విచారణ కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడింది. అయితే, కేసు నమోదు తీరును బట్టి నిందితుడికి జరిమానా విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో ఏకీభవించిన న్యాయస్థానం, నిందితుడికి రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ల్యాప్టాప్ కొనుగోలు చేయగా మిగిలిన డబ్బును హైకోర్టు ఉద్యోగుల వైద్య సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa