హోలీ పండుగ ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. రంగులు, పిచికారీలు, పండుగ బహుమతులపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా నకిలీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆకర్షణీయమైన ధరలకే బ్రాండెడ్ వస్తువులు లభిస్తాయనే ఆశ చూపిస్తూ వాట్సాప్, ఎస్ఎంఎస్ (SMS)ల ద్వారా తెలియని లింకులను పంపుతున్నారు. ఈ లింకులను క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్ వివరాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ ఈవెంట్లు, హోలీ పార్టీలకు సంబంధించిన ఎంట్రీ పాస్ల పేరుతో కూడా ఈ కేటుగాళ్లు వల విసురుతున్నారు. అధికారిక వెబ్సైట్ల తరహాలోనే ఉండే నకిలీ వెబ్సైట్లను సృష్టించి, తక్కువ ధరకే పాస్లు బుక్ చేసుకోవచ్చని నమ్మిస్తున్నారు. ఒకసారి ఆ లింకులపై క్లిక్ చేసి పేమెంట్ చేస్తే, మీ డబ్బులు పోవడమే కాకుండా మీ ఫోన్లోకి మాల్వేర్ చేరే ప్రమాదం ఉంది. దీనివల్ల మీ ఫోన్ హ్యాక్ అయ్యి, మీ ప్రమేయం లేకుండానే ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిస్తోంది.
ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని, అనధికారిక లింకులను అస్సలు క్లిక్ చేయకూడదని ఆమె స్పష్టం చేశారు. ఏదైనా వస్తువును కొనుగోలు చేసేటప్పుడు లేదా ఈవెంట్ పాస్లు బుక్ చేసేటప్పుడు కేవలం గుర్తింపు పొందిన వెబ్సైట్లను మాత్రమే ఆశ్రయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్లు పండుగ సీజన్లలో ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారని ఆమె గుర్తు చేశారు.
ఒకవేళ మీరు పొరపాటున ఈ సైబర్ మాయగాళ్ల వలలో పడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. సైబర్ క్రైమ్ బాధితులు వెంటనే 1930 అనే హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని శిఖాగోయల్ తెలిపారు. అలాగే www.cybercrime.gov.in పోర్టల్లో కూడా మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. బాధితులు ఎంత త్వరగా స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్మును వెనక్కి రప్పించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa