పెట్టుబడులపై మెరుగైన రాబడి కోసం మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు.. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో అయితే రిస్క్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. గోల్డ్, రియల్ ఎస్టేట్ నిలకడగా రాబడి అందించవు. ఇక స్థిరమైన రిటర్న్స్ కోసం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ స్కీమ్స్ వంటివి ఉన్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కొంత కాలంగా భారీగా తగ్గుతూ వచ్చాయి. ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తున్న క్రమంలో.. బ్యాంకులు ఎఫ్డీ రేట్లను చారిత్రక కనిష్టాలకు చేర్చాయి. అయినప్పటికీ సీనియర్ సిటిజెన్లకు మాత్రం బ్యాంకుల్లో డిపాజిట్లపై సాధారణ ప్రజలతో పోలిస్తే 50 బేసిస్ పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ రేట్ల గురించి తెలుసుకుందాం.
ఎస్బీఐ కూడా ఆర్బీఐ బాటలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను వరుసగా తగ్గిస్తూ వచ్చింది. అయినప్పటికీ ఈ ప్రముఖ బ్యాంకుల్లో చాలా మంది డిపాజిట్లు చేస్తుంటారు. 7 రోజుల నుంచి గరిష్ఠంగా 10 సంవత్సరాల వ్యవధి వరకు ఫిక్స్డ్ డిపాజిట్లను ఈ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. కనీసం రూ. 1000 నుంచి డిపాజిట్ చేయొచ్చు. రిటైల్ టర్మ్ డిపాజిట్లపై గరిష్ఠ పరిమితి రూ. 3 కోట్లుగా ఉంది.
ఎస్బీఐ ఎఫ్డీ రేట్లు..
7 రోజుల నుంచి 45 రోజుల వ్యవధికి సాధారణ ప్రజలకు ఎస్బీఐ 3.05 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజెన్లకు 3.55 శాతంగా ఉంది. 46 రోజుల నుంచి 179 రోజుల వ్యవధికి చూస్తే వడ్డీ రేట్లు వరుసగా 4.90 శాతం, 5.40 శాతంగా ఉన్నాయి. 180 రోజుల నుంచి 210 రోజుల కాల వ్యవధికి సాధారణ ప్రజలకు 5.65 శాతం, సీనియర్ సిటిజెన్లకు 6.15 శాతంగా వడ్డీ రేటు ఉంది. 211 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్లపై వరుసగా వడ్డీ రేట్లు 5.90 శాతం, 6.40 శాతంగా ఉన్నాయి.
ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధికి సాధారణ ప్రజలకు ఎస్బీఐ 6.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు 6.75 శాతం ఆఫర్ చేస్తోంది.
రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్లపై వరుసగా 6.40 శాతం, 6.90 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.
మూడేళ్ల నుంచి ఐదేళ్ల వ్యవధిపై సాధారణ ప్రజలకు ఎస్బీఐ 6.30 శాతం, సీనియర్ సిటిజెన్లకు 6.80 శాతం వడ్డీ ఇస్తోంది.
5 నుంచి 10 సంవత్సరాల వ్యవధి డిపాజిట్పై వరుసగా వడ్డీ రేట్లు 6.05 శాతం, 7.05 శాతంగా ఉంది. ఇక్కడ సాధారణ ప్రజల కంటే ఏకంగా 100 బేసిస్ పాయింట్ల మేర సీనియర్ సిటిజెన్లకు అధిక వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ వీ కేర్ డిపాజిట్ స్కీమ్ కింద ఇక్కడ సీనియర్ సిటిజెన్లకు 5-10 ఏళ్ల వ్యవధిపై అధికంగా వడ్డీ ఇస్తోంది.
5 లక్షలు జమ చేస్తే పదేళ్లలో రాబడి ఇలా..
మనం ఇప్పుడు 10 సంవత్సరాల వ్యవధికి రూ. 5 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేస్తే.. సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజెన్లకు రాబడి ఎంత వస్తుందో చూద్దాం. సాధారణ ప్రజలకు ఇక్కడ 6.05 శాతం వడ్డీ రేటు ఉండగా.. 5 లక్షలపై పదేళ్లకు వడ్డీతోనే రూ. 4,11,488 వస్తుంది. మొత్తం చేతికి రూ. 9,11,488 వస్తుంది. ఇదే సీనియర్ సిటిజెన్లకు 7.05 శాతం వడ్డీ రేటు చొప్పున 5 లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీకి అంటే పదేళ్లలో వడ్డీతో రూ. 5,05,728 వస్తుంది. మెచ్యూరిటీకి మొత్తం రూ. 10.05 లక్షలు వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa