ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అంగన్‌వాడీల జీతాల పెంపు.. మంత్రి సంధ్యారాణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 07:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. అసెంబ్లీలో అంగన్‌వాడీల అంశంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గతంలో అంగన్‌వాడీలకు జీతం రూ.4200 ఉండేదని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీతాన్ని రూ.11,500కు పెంచామని మంత్రి తెలిపారు. అంగన్‌వాడీలకు మూడుసార్లు జీతాలు పెంచిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అంగన్‌వాడీలు 10 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడితే 9 హామీలను నెరవేర్చామన్నారు.


అంగన్‌వాడీలకు ఇటీవల రూ.75 కోట్లతో 5జీ ఫోన్లను అందజేశామన్నారు మంత్రి సంధ్యారాణి. 20వేల అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టౌలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది పిల్లలకు ఇండోర్ గేమ్స్, చార్ట్‌లు అందజేశామన్నారు. రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని అంగన్‌వాడీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే అంగన్‌వాడీల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు 62 సంవత్సరాలు పూర్తయితే వారికి గ్రాట్యూటీ ఇస్తామన్నారు. అలాగే చనిపోయిన వారికి మట్టి ఖర్చులు రూ.15,000 వేలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.


రాష్ట్రంలో 55,476అంగన్‌వాడీ కేంద్రాలుఉంటే.. వాటిలో 21,756 కేంద్రాలు మాత్రం సొంత భవనాలు, 10,556 ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయన్నారు మంత్రి సంధ్యాారాణి. మరో 23,424 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని ప్రకటించారు.. ప్రస్తుతం కొన్ని భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. 'అంగన్‌వాడీ కేంద్రాల్లో రాగి, జొన్నలను కూడా ఆహరంగా అందిస్తున్నాము. అంగన్‌వాడీలకు స్టేషన్ రికగ్నిజైషన్ ఉంది.. అందరూ సెంటర్లకు వస్తున్నారు. అంగన్‌వాడీల్లోని పిల్లలకు ముస్తాబు కార్యక్రమం అమలు చేస్తున్నాము.అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు బరువు పెరుగుతున్నారో లేదో చూసుకొనే బాధ్యత టీచర్లకు, ఆయాలకు అప్పగిస్తున్నాము. అంగన్‌వాడీల్లోని గతంలో 70శాతంగా ఉన్న పిల్లల హాజరు.. ఇప్పడు 93శాతానికి పెరిగింది అన్నారు. ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది' అని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి అంగన్‌వాడీల జీతాల సమస్యపై పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి సంధ్యారాణి ఇటీవల హామీ ఇచ్చారు. అంగన్‌వాడీలు ధర్నాలు, ఆందోళనలు విరమించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa