పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు తాత్కాలికంగా అనుమతి ఇస్తున్నాం.. అంటూ అమెరికా మంత్రి స్కాట్ బెన్నెట్ ఇటీవల వ్యాఖ్యానించారు. బెన్నెట్ చేసిన వ్యాఖ్యల పట్ల భారత్లోని రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. భారత్కు పర్మిషన్ ఇవ్వడానికి అమెరికా ఎవరు? అంటూ ప్రతిపక్ష నేతలు ఘాటుగా స్పందించారు. ఈ విషయమై భారత ప్రభుత్వం కూడా గట్టిగానే స్పందించింది.
అయితే రష్యా ఆయిల్ కొనుగోలు చేయడానికి భారత్కు పర్మిషన్ ఇచ్చానని చెప్పుకుంటున్న అమెరికా.. వాస్తవానికి ఈ విషయంలో ఇండియాను బతిమాలుకుంటోంది. ఎయిర్ఫోర్స్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం చమురుపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే చమురు ధరలు 20 శాతానికిపైగా పెరిగి, బ్యారెల్కు 90 డాలర్ల కంటే ఎగువకు చేరాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే చమురు ధరలు 150 డాలర్లకు చేరతాయనే అంచనాలు ఉన్నాయి.
ప్రపంచంలో అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత రిఫైనరీలు ముడి చమురును దిగుమతి చేసుకొని శుద్ధి చేసి తిరిగి మార్కెట్లో విక్రయిస్తుంటాయి. భారత్ గనుక రష్యా నుంచి ఆయిల్ కొనకుండా.. గల్ఫ్ దేశాల నుంచే కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే.. ఆయిల్ కోసం పోటీ మరింత ఎక్కువ అవుతుంది. దీంతో చమురు కొరత ఏర్పడి.. ధరలు పెరుగుతాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా పట్ల వ్యతిరేకత తలెత్తే ప్రమాదం ఉంది.
ఒకవేళ భారత్ గనుక రష్యా ఆయిల్ దిగుమతులను పెంచుకుంటే.. ఇతర దేశాలు ఉత్పత్తి చేసే ఆయిల్ను ప్రపంచంలోని మిగతా దేశాలు కొనుగోలు చేస్తాయి. అంటే పోటీ తక్కువగా ఉంటుంది. అంతేకాదు భారత్ ముడి చమురును శుద్ధి చేసి తిరిగి మార్కెట్లో విక్రయిస్తుంది. జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీ.. ప్రపంచంలోని అతిపెద్ద చమురుశుద్ధి కేంద్రం. కాబట్టి ఇండియా రిఫైన్ చేసిన ఆయిల్ను మిగతా దేశాలు కొనుగోలు చేయడానికి వీలుంటుంది. దీని వల్ల చమురు ధరలు, మార్కెట్ స్థిరంగా ఉండటానికి వీలవుతుంది. అందుకే చమురు మార్కెట్లో ఒత్తిడి తగ్గించడం కోసం భారత్కు వెసులుబాటును ఇచ్చామని ట్రంప్ ప్రకటించారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే.. వాస్తవానికి అమెరికా మనకు అనుమతి ఇవ్వడం లేదు. ఏ దేశం నుంచి అయితే ఆయిల్ కొంటున్నారనే కారణంతో గతంలో మనపై సుంకాలు వేశారో.. ఇప్పుడు అదే దేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేయండి అని అగ్రరాజ్యం రిక్వెస్ట్ చేస్తోంది. కానీ పైకి మాత్రం పర్మిషన్ ఇచ్చాం.. పండగ చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతోంది.
ట్రంప్ మాటలను బట్టి చూస్తే.. చమురు మార్కెట్ను స్థిరంగా ఉంచడంలో భారత్ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొనుగోలు చేసి, దాన్ని ప్రాసెస్ చేసి తిరిగి మార్కెట్లో విక్రయించడం వల్ల ప్రపంచ దేశాలు ముఖ్యంగా, అమెరికాతోపాటు దాని మిత్రులైన యూరప్ దేశాలు లబ్ధి పొందుతున్నాయి.
మా దగ్గర చమురు నిల్వలు ఫుల్గా ఉన్నాయి. మాకొచ్చిన ఇబ్బందేం లేదని ట్రంప్ చెప్పుకోవచ్చు గాక. కానీ ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగితే.. ఆ ధరకే అమెరికాలోనూ ఆయిల్ అమ్మాలి. దీని వల్ల రవాణా ఖర్చులు, ఆహారం, వస్తువుల ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనివల్ల సొంత ప్రజల్లోనూ తన పట్ల వ్యతిరేకత పెరుగుతుందనే భయం కూడా ట్రంప్లో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa