అమెరికాలోని అత్యంత రద్దీ నగరమైన న్యూయార్క్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా న్యూయార్క్ నగర తొలి ముస్లిం మేయర్ జోహ్రాన్ మమ్దానీ అధికారిక నివాసమైన 'గ్రేసీ మాన్షన్' లక్ష్యంగా పేలుడు కుట్ర జరిగింది. ముఖ్యంగా రెండు విరుద్ధ నిరసన బృందాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
పవిత్ర రంజాన్ మాసంలో మేయర్ మమ్దానీ నివాసం వెలుపల రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇన్ఫ్ల్యూయెన్సర్ జేక్ లాంగ్ ఆధ్వర్యంలో జరిగిన ఇస్లాం వ్యతిరేక నిరసనను అడ్డుకునేందుకు సుమారు 125 మందితో కూడిన మరొక బృందం 'డ్రైవ్ ది నాజీస్ అవుట్ ఆఫ్ న్యూయార్క్' పేరుతో ఎదురు నిరసన చేపట్టింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో ఒక నిరసనకారుడు పెప్పర్ స్ప్రే ప్రయోగించడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.
వెంటనే 18 ఏళ్ల ఓ యువకుడు తన వద్ద ఉన్న అనుమానాస్పద పేలుడు పరికరాన్ని వెలిగించి నిరసన ప్రాంతం వైపు విసిరాడు. అయితే అది గాల్లో ప్రయాణిస్తూ.. మంటలు, పొగను చిమ్ముతూ పోలీస్ బారికేడ్లను తాకి, అధికారులకు కేవలం కొద్ది అడుగుల దూరంలోనే పడిపోయింది. ఆ తర్వాత మరో 19 ఏళ్ల యువకుడి వద్ద నుంచి రెండో పరికరాన్ని తీసుకుని వెలిగించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు.
పేలుడు పరికరాల గుట్టు..
పోలీసు కమీషనర్ జెసికా టిష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న రెండు పరికరాలు ఫుట్బాల్ కంటే కొంచెం చిన్నగా ఉన్నాయి. ఒక గాజు జార్కు నల్లటి టేప్ చుట్టి, అందులో బోల్టులు, స్క్రూలు, వెలిగించేందుకు వీలుగా ఒక 'హాబీ ఫ్యూజ్' అమర్చినట్లు చెప్పారు. ఇవి నిజంగా పనిచేసే పేలుడు పదార్థాలా లేక కేవలం భయపెట్టేందుకు తయారు చేసినవా అనే కోణంలో బాంబు స్క్వాడ్, ఎఫ్బీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మేయర్ సురక్షితం..
ఈ దాడి ప్రయత్నం జరిగిన సమయంలో మేయర్ మమ్దానీ, ఆయన భార్య రామా దువాజీ నివాసంలోనే ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం వారిద్దరూ సురక్షితంగానే ఉన్నారని మేయర్ ప్రతినిధి జో కాల్వెల్లో ధృవీకరించారు. మేయర్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడం హేయమైన చర్య అని ఆయన ఖండించారు.
న్యూయార్క్లో హై అలర్ట్..
ప్రస్తుతం ఆ ప్రాంతమంతటా భద్రతా బలగాలను మోహరించారు. స్నిఫర్ డాగ్స్ సహాయంతో పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయేమోననిపోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ ఈ ఘటనపై స్పందిస్తూ.. "న్యూయార్క్లో శాంతియుత నిరసనలకు తావుంది. కానీ ద్వేషానికి, హింసకు ఇక్కడ చోటు లేదు" అని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa