కృత్రిమ మేధ సాయంతో ఇద్దరు యువతులు ప్రాణాలు తీసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గుజరాత్లోని సూరత్లో చోటుచేసుకున్న ఈ విషాదకర ఉదంతంపై టెక్ దిగ్గజం, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు. ముఖ్యంగా చాట్ జీపీటీ సాయంతో గుడిలోని బాత్రూంలో వారు ప్రాణాలు తీసుకోవడంపై.. ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత భయానకమైన విషయమంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
అసలేం జరిగిందంటే..?
సూరత్కు చెందిన 18, 20 ఏళ్ల వయసు కల్గిన ఇద్దరు యువతులు ప్రాణ స్నేహితులు. గత శుక్రవారం కాలేజీకి వెళ్లిన వారు సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారి ఫోన్లను ట్రాక్ చేయగా.. సూరత్లోని ప్రసిద్ధ స్వామినారాయణ ఆలయం వద్ద వారి లొకేషన్ చూపించింది. దీంతో వెంటనే వారు ఆలయానికి చేరుకున్నారు. అక్కడే ఆలయ ఆవరణలో వారి స్కూటర్ పార్క్ చేసి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు.. సీసీటీవి దృశ్యాలను పరిశీలించారు. దీంతో వారు ఆలయ వాష్రూమ్లోకి వెళ్లినట్లు తేలింది. అయితే లోపలికి వెళ్లిన వారు ఎంతకూ బయట రాలేదు. దీంతో పోలీసులే బాత్రూం లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు.
సెర్చ్ హిస్టరీలో బయటపడ్డ భయంకర నిజాలు..
అయితే వారిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు విషయాన్ి తెలిపారు. ఆపై వారు ఎలా చనిపోయారోనని విచారణ జరపగా.. పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతుల మృతదేహాల వద్ద అనస్థీషియా బాటిల్స్, సిరంజీలు లభించాయి. సూరత్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్పీ గోహిల్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతుల ఫోన్లను అన్లాక్ చేసి చూడగా, వారి చాట్జీపీటీ సెర్చ్ హిస్టరీలో "ఆత్మహత్యకు ఏ డ్రగ్స్ వాడాలి?", "సులభంగా ప్రాణాలు ఎలా తీసుకోవాలి?" వంటి ప్రశ్నలు ఉన్నాయి.
గతంలో ఒక మహిళ అనస్థీషియా ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా వారి గ్యాలరీలో కనిపించింది. చాట్జీపీటీ ఇచ్చిన సమాచారంతోనే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించగా.. ఈ వార్త నెట్టింట వైరల్ అయింది. అయితే తాజాగా ఈ ఘటనపై ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ స్పందించారు. భయంకరమైన వార్త అంటూ ఒక్క ముక్కలో తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఓపెన్ ఏఐ సంస్థతో న్యాయపోరాటం చేస్తున్న మస్క్.. చాట్జీపీటీ వంటి ఏఐ సాధనాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ ఘటనతో నిరూపితమైందని పరోక్షంగా విమర్శించారు. తన ఏఐ చాట్బాట్ 'గ్రోక్' (Grok) వల్ల ఇప్పటివరకు ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదని, కానీ చాట్జీపీటీ వల్ల ఇలాంటి ప్రాణాలు పోతున్నాయని గతంలోనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa