విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని భావిస్తున్న కృత్రిమ మేధ.. పరీక్షా కేంద్రాల్లో అక్రమాలకు అస్త్రంగా మారడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర బోర్డు పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొట్టడానికి సాక్షాత్తూ పరీక్షా సిబ్బందే చాట్జీపీటీని వాడి సహాయం చేసిన విస్తుపోయే నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంపై సీరియస్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన, అక్రమాలకు సహకరించిన 81 మంది సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
అసలేం జరిగిందంటే..?
మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఇటీవల 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు జరిగాయి. అయితే బీడ్ జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని బోర్డు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టగా.. అక్కడ జరుగుతున్న హైటెక్ మోసం బయటపడింది. సాధారణంగా విద్యార్థులు పుస్తకాలు లేదా చిన్న పేపర్లతో కాపీ కొట్టడం చూస్తుంటాం. కానీ ఇక్కడ పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షకులుగా ఉండాల్సిన సిబ్బందే తమ స్మార్ట్ ఫోన్లలో చాట్జీపీటీని ఓపెన్ చేసి.. ప్రశ్నలకు సమాధానాలు వెతికి మరీ విద్యార్థులకు చేరవేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞానం కోసం కాకుండా, పరీక్షల సమగ్రతను దెబ్బతీయడానికి ఉపయోగించడం అధికారులను విస్మయానికి గురిచేసింది.
81 మందిపై సస్పెన్షన్ వేటు..
దర్యాప్తు నివేదిక ఆధారంగా మహారాష్ట్ర విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. మాస్ కాపీయింగ్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన జిల్లా వ్యాప్తంగా ఉన్న 81 మంది సిబ్బందిని విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. "పరీక్షల నిర్వహణలో పారదర్శకత చాలా ముఖ్యం. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు" అని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లపై నిషేధం ఉన్నప్పటికీ.. సిబ్బంది వాటిని ఎలా లోపలికి తీసుకెళ్లారు? అనే కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి పరీక్షా కేంద్రాల్లో సిగ్నల్ జామర్లు ఏర్పాటు చేయడం, మరింత కఠినమైన నిఘా ఉంచడం వంటి చర్యలపై బోర్డు ఆలోచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa