పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 'రాష్ట్రపతి ప్రోటోకాల్' చిచ్చు రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బెంగాల్ ప్రభుత్వం అవమానించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కేవలం మాటలతోనే కాకుండా పాత ఫోటోలను ఆధారంగా చూపుతూ ప్రధానిపైనే ఆమె రివర్స్ ఎటాక్ చేశారు. రాష్ట్రపతిని గౌరవించనిది మేము కాదు మీరేనని చెప్పారు. ఇందుకు సాక్ష్యం ఇదిగో అంటూ ఆమె పెట్టిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రధాని విమర్శలేమిటంటే..?
ఇటీవల పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వలేదని, ఒక గిరిజన మహిళా రాష్ట్రపతిని మమతా సర్కార్ అవమానిస్తోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. బీజేపీ శ్రేణులు కూడా ఈ అంశాన్ని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేశాయి. ముఖ్యంగా దీదీ.. ద్రౌపది ముర్మును కలవకపోవడంపై పెద్ద ఎత్తున రచ్చ చేశారు. దీంతో తాజాగా మమతా బెనర్జీ ఈ అంశంపై స్పందించారు.
అద్వానీ ఘటనను ప్రస్తావిస్తూ.. మీరే అవమానించారని వెల్లడి
ప్రధాని ఆరోపణలకు ధీటుగా సమాధానమిస్తూ.. ఆదివారం మమతా బెనర్జీ ఒక కీలక ఫోటోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అందులో 2024 మార్చిలో సీనియర్ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రధానం చేసిన ఫొటో ఉంది. "భారత రాష్ట్రపతి, ఒక గిరిజన నాయకురాలిని గౌరవించని వ్యక్తి మీరు. మేము కాదు. ఆ ఫోటో చూడండి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిల్చుని అవార్డు ఇస్తుంటే.. ప్రధాని మోదీ గారు మాత్రం పక్కనే కూర్చుని ఉన్నారు. రాష్ట్రపతికి కనీసం నిలబడి గౌరవం ఇవ్వని వారు మమ్మల్ని విమర్శించడమా?" అని మమత సూటిగా ప్రశ్నించారు.
బెంగాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతుండగా.. గిరిజన ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు బీజేపీ ఇలాంటి విమర్శలు చేస్తోందని టీఎంసీ చెబుతోంది. ముఖ్యంగా రాష్ట్రపతి గౌరవాన్ని అడ్డం పెట్టుకుని ప్రధాని మోదీ సైతం అనేక మంది బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు సీఎం మమత ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన పదవుల పట్ల గౌరవం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa