ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సుంకాలు తగ్గించాల్సిందే: భారత్‌కు ట్రంప్ హితవు

international |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2019, 11:23 AM

అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోన్న వస్తువులపై భారత్ అత్యధికంగా సుంకాలను(టారిఫ్‌) పెంచడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం తమకు ఆమోదం కాదని.. దీనిని ఉపసంహరించుకోవాలని ఆయన ప్రధాని మోదీకి సూచించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసిన ట్రంప్.. ‘‘భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటోన్న వస్తువులపై ఆ దేశం అత్యధిక సుంకాలను విధిస్తోంది. ఇటీవల కాలంలో ఇవి మరింత పెరిగాయి. ఇది ఎంత మాత్రం ఆమోదం కాదు. దీనిని భారత్ ఉపసంహరించుకోవాలి. ఈ విషయంపై నేను భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తాను’’ అని ఆయన అన్నారు.


కాగా జీ20 సమావేశాల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జపాన్‌కు బయలుదేరి వెళ్లారు. ఇక ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని ఒసాకాకు చేరుకున్నారు. ఈ ఇద్దరు శుక్రవారం భేటీ అవ్వనున్నట్ల తెలుస్తోంది. కాగా బుధవారం భారత్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో భేటీ అయిన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య హద్దులు చెరిపివేయాలని కోరారు. భారత్- అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇది మరింత దోహద పడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ నెలారంభంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న 28 వస్తువులపై భారత్ కస్టమ్ సుంకాలను పెంచింది. వాణిజ్యపరమైన రాయితీలకు తాము స్వస్తి చెబుతున్నామంటూ ట్రంప్ జూన్ 1న ప్రకటించడంతో.. ఇందుకు ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వస్తువుల్లో ఆల్మండ్స్, ఆపిల్స్, పల్సెస్, వాల్‌నట్స్ వంటివి ఉన్నాయి. మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ట్రంప్‌తో సమావేశం కావడం ఇదే మొదటిసారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa