శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 29వ తేదీ నుంచి నిర్వహించనున్న శ్రీ వికారి నామ సంవత్సర దసరా మహోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి రావడం జరుగుతుందని, ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సక్రమంగా విధులు నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్ తమ విడిది కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ మాట్లాడుతూ ఇప్పటికే దసరా ఉత్సవాలపై రెండు సార్లు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామన్నారు. క్షేత్రస్థాయిలో కూడా మంత్రులు, దేవస్థానం అధికారులు, సోమా ప్రతినిధులు, జాతీయ రహదారుల, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఫైర్, తదితర శాఖల అధికారులతో పరిశీలించామన్నారు. ఏఏ శాఖల అధికారులు చేపట్టాల్సిన విధులకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశామని, యాక్షన్ ప్లాన్ , టైం ప్లాన్పై ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు. సోమా, జాతీయ రహదారుల అధికారులు దుర్గా పైవంతెన నిర్మాణ పనులు కూడా దేవస్థానం అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. తలనీలాలు, దుర్గా ఘాట్ వద్ద భక్తులకు ఆటంకాలు కలగకుండా ఆయా ప్రాంతాలను దేవస్థానం వారికి అందుబాటులో ఉంచాలన్నారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ , మున్సిపల్, అగ్నిమాపక, విపత్తుల నివారణ, తదితర శాఖల అధికారుల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. అక్టోబరు 8న కృష్ణా నదిలో నిర్వహించనున్న తెప్పోత్సవానికి సంబంధించిన ట్రైల్రన్ను ఇరిగేషన్, తదితర శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుంచి కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్బాబు పేర్కొన్నారు. మూలా నక్షత్రం రోజున ఉదయం 1 గంట నుంచి రాత్రి 11 వరకు అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa