ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరతపై జగన్ సర్కార్ను పవన్ విమర్శలను వెల్లంపల్లి తిప్పికొట్టారు. చంద్రబాబుకు పవన్ తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి లేకపోతే ఉండలేడని వెల్లంపల్లి విమర్శించారు. 2009లో చిరంజీవి అధికారంలోకి వస్తాడని భావించాడన్నారు. మెగాస్టార్ అధికారంలోకి రాకపోయేసరికి ఆయన నుంచి దూరమయ్యాడని.. పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారని ఆరోపించారు. ఆ తరువాత చంద్రబాబుకు తోకలా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఇప్పుడు పవన్ కన్ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పడిందని విమర్శించారు. ఎలాగైనా మోదీతో కలవాలని నీచ రాజీకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్పై విమర్శలు చేస్తే ప్రజలు ఆదరిస్తారనే భ్రమలో పవన్ ఉన్నారని మండిపడ్డారు. నదుల్లో వరదలు కొనసాగుతుంటే ఇసుక ఎలా తవ్వుతారని ఆయన ప్రశ్నించారు. పవన్ ఒక్కసారి ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి చూడాలని హితవు పలికారు. వరద పోటెత్తుతుండడంతో 50 రోజులుగా ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచే ఉన్నాయన్నారు. ఇసుక ఎక్కడి నుంచి తీయాలో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం తరఫున విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆ పార్టీలో కొనసాగారు. ఆ తరువాత కాలంలో వైఎస్సార్సీపీలో చేరారు. 2019లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై జగన్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కలిసి పనిచేసిన వెల్లంపల్లి జనసేన అధినేత పవన్పై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa