విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో జరిగిన ప్రమాదం భార్యా భర్తలను బలిగొంది. జీఆర్పీ పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బయలుదేరిన రైలులో విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన వెంకటరమణారావు (40), మణి (35) దంపతులు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున రైలు దువ్వాడ స్టేషన్ కు చేరుకుంది. దువ్వాడలో మణి తల్లిదండ్రులు ఉండటంతో, వారిని చూసి, ఆపై స్వగ్రామానికి వెళ్లాలన్న ఉద్దేశంతో వారిద్దరూ రైలు దిగేందుకు సిద్ధమయ్యారు. నాలుగో నంబర్ ప్లాట్ ఫామ్ కు రైలు చేరుకోగా, దిగేందుకు ప్రయత్నించి, ప్రమాదవశాత్తూ పట్టాలపై పడి ప్రాణాలను కోల్పోయారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, రెండు మృతదేహాలనూ అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa