కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ షాకిచ్చారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వీలైనన్న కొత్త స్కీములతో ఢిల్లీ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ ప్రారంభించిన ఓ కొత్త కార్యక్రమంతో అమిత్షా తీసుకున్న మరో నిర్ణయం అమలుకు బ్రేక్ పడింది. అనుకోకుండా జరిగినా.. యాక్షన్ ప్లాన్లో భాగంగా జరిగినా కేజ్రీవాల్ చర్య అమిత్షాకు కౌంటర్గానే పలువురు భావిస్తున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాగంగా ఢిల్లీలోని జామియా వర్సిటీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. పలు సందర్భాలలో ఇది హింసాత్మకం కూడా అవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపి వేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొన్ని ఏరియాలలో గురువారం మధ్యాహ్నం నుంచి ఇంటర్ నెట్ సర్వీసులు నిలిచిపోయాయి.
మరోవైపు మరో రెండు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోబోతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త కొత్త పథకాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలో 11 వేల వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్.. తొలి విడతగా 100 వైఫై హాట్ స్పాట్లను గురువారం ప్రారంభించారు. హోం శాఖ ఆదేశాల మేరకు ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారో.. అదే ప్రాంతాల్లో కేజ్రీవాల్ వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేయడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ పని చేయడం ప్రారంభమైంది.
యాదృచ్ఛికమో లేక ప్రీ-ప్లాన్డ్గా చేశారో గానీ.. ఆందోళనలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో మళ్ళీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కావడంతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరిణామాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారకులంటూ బిజెపి నేతలు ఆరోపణలు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa