జీఎన్ రావు కమిటీ నివేదికపై వైసీపీ మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని బొత్స స్పష్టం చేశారు. గత ప్రభుత్వం శిమరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనబెట్టి నారాయణ రిపోర్టును పరిగణలోకి తీసుకుందని.. అది సరికాదని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అభివృద్ధి కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదన్నదే ప్రభుత్వ అభిప్రాయమని ఆయన అన్నారు. కమిటీ నివేదికపై ఈ నెల 27 వ తేదీన జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని కమిటీ సిఫార్సు చేసిందని.. దానిపై క్యాబినెట్లో చర్చిస్తామన్నారు. అమరావతిని ఎడ్డుకేషన్ హబ్గా మారుస్తామన్నారు. అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్, సీఎం క్యాంపు కార్యాలయం అమరావతిలోనే ఉంటాయని బొత్స తెలిపారు. అలాగే రాజధాని రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు మంత్రి బొత్స. ల్యాండ్ పూలింగ్లో భాగంగా తీసుకున్న అసైన్డ్ భూములను తిరిగి ఇచ్చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే అసెంబ్లీలో కూడా చెప్పామని గుర్తు చేశారు. అసైన్డ్ భూములు లాక్కొని బలహీన వర్గాలకు చంద్రబాబు అన్యాయం చేశారని.. తమ ప్రభుత్వం తప్పులను సరిచేస్తోందన్నారు. చంద్రబాబు తన తాబేదారుల కోసం దోపిడీకి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. 1.90 లక్షల కోట్ల రూపాయల అప్పుతెచ్చిన చంద్రబాబు రాజధానికి ఎందుకు ఖర్చు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రాజధానిలో కేవలం ఐదువేల కోట్ల పనులు మాత్రమే జరిగాయని పునరుద్ఘాటించారు. ప్రతిపక్షాలు రాజకీయాల కోసం వ్యతిరేకిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa