ఆంధ్రప్రదేశ్ లో మునుపు ఎన్నడూ లేని చిత్రమైన పరిస్థితి నెలకొందన్నది ప్రజలు కూడా భావిస్తున్నారు. కొన్ని సంవత్సరాల ముందు అసలు రాజధాని లేని రాష్ట్రంగా విలవిలలాడిపోయిన రాష్ట్రంలో ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనట్టు ఏకంగా మూడు రాజధానులు ఉండబోతున్నాయన్నది తాజాగా ప్రభుత్వానికి అందిన నివేదిక తేల్చి చెప్పింది.
ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో “దక్షిణాఫ్రికా దేశాన్ని చూస్తే వారికి మూడు రాజధానులుంటాయి. బహుశా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయేమో. మూడు రాజధానులు రావలసిన అవసరం కనిపిస్తోంది” అని జగన్ ముందు హింట్ ఇచ్చారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, మరియు కర్నూల్ లో జ్యుడీషియల్ కేపిటల్ ఉండవచ్చు అని ముఖ్యమంత్రి ప్రకటించగా అందుకు అనుగుణంగానే కమిటీ నివేదిక ఇచ్చింది.
నిజానికి దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవన్నది నిజం. మూడు కాకుంటే 30 పెట్టుకుం టామని మంత్రులు ఎకసెక్కాలు చేస్తుంటే జనం కూడా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మరి కొన్ని డిమాండ్లు తెర మీదకు తెస్తు రాజధానులు మాకూ కావాలంటూ పోరాటాలకు రడీ అయిపోతున్నారు. ఇప్పటికే తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ పోరాట సమితి డిమాండ్ చేస్తూ, ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతిని ప్రకటించకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఉధృతం చేసేందుకు సిద్దమవుతోంది. ఇక రాజమండ్రిని సాంస్కృతిక రాజధానిగా ప్రకటించమని ఎప్పటి నుంచో వస్తున్న డిమాండ్ మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ లెక్కన మూడు రాజధానులతో ఆగిపోకుండా మంత్రిగారు చెప్పినన్ని కాకున్నా పదమూడు జిల్లాలకు సరిపడా ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటిగా.. పదమూడు రాజధానుల డిమాండ్ మొదలవుతుందేమో అనికొందరు సామాజిక మీడియాలో సెటైర్లేస్తుంటే.... జిల్లాలల వికేంద్రీకరణ చేసేసి, జిల్లా కేంద్రాలను కూడా రాష్ట్రానికి రాజధానిని చేసేయాలన్న కొత్త డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. అదండీ సంగతి...
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa