రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, నేతలే పేకాట క్లబ్బులు, గుండాట శిబిరాలు నిర్వహిస్తూ జూదాన్ని రాష్ట్ర క్రీడగా చేసి, రాష్ట్రాన్ని పేకాటాంధ్రప్రదేశ్గా మార్చారని టీడీపీ నేత కళావెంకట్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పేకాటను ఒలంపిక్స్లో చేర్చాలని వైసీపీ నేతలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు.
మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామంలోనే మంత్రి అనుచరులు, వైసీపీ నేతలు పేకాట ఆడుతూ పట్టుబడుటమే కాక, పట్టుకున్న పోలీసులపై దాడిచేయటం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి జయరాం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపించి తన నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మంత్రి స్వగ్రామం అంటే సంక్షేమం, అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపి మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని... కానీ పేకాట శిబిరాలు, నాటు సారా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా లూటీ చేయటం సిగ్గుచేటని అన్నారు.
వైసీపీ మంత్రులు చట్టానికి లోబడి వ్యవహరిస్తామని ప్రమాణం చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కళావెంకట్రావు ఆరోపించారు. మంత్రిపై ఆరోపణలు వస్తే కనీసం ముఖ్యమంత్రి ఎందుకు మంత్రిని మందలించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే కాక ముఖ్యమంత్రి జగన్మోహరెడ్డి సొంత నియోజకవకర్గం పులివెందులలో కూడా వైసీపీ నేతలు యదేచ్ఛగా పెద్ద ఎత్తున పేకాట క్లబ్బులు, గుండాట నిర్వహించి ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు తమ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ సామాన్య ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలపై దృష్టి పెట్టి వాటికి అడ్డుకట్ట వేయాలని... లేకపోతే ప్రజలే తమ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేస్తారని కళావెంకట్రావు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa