రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ 68వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంస్థ సేవలను కొనియాడారు. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్' సమయంలో డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయని, మన దేశీయ ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని అన్నారు. ఇది సంస్థ నిబద్ధతకు నిదర్శనమని ప్రశంసించారు.గురువారం ఢిల్లీలోని డీఆర్డీవో ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజ్నాథ్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'సుదర్శన చక్ర' రూపకల్పనలో డీఆర్డీవో కీలక పాత్ర పోషించనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కింద దేశంలోని కీలక సంస్థాపనలకు పూర్తిస్థాయి వైమానిక రక్షణ కల్పించే బాధ్యతను డీఆర్డీవోకు అప్పగించినట్లు తెలిపారు. ఆధునిక యుద్ధంలో ఎయిర్ డిఫెన్స్ ప్రాముఖ్యతను ఆపరేషన్ సిందూర్ సమయంలో చూశామని, ఈ లక్ష్యాన్ని డీఆర్డీవో త్వరగా సాధిస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, సాయుధ బలగాలకు అత్యాధునిక సాంకేతికతను అందించడంలో డీఆర్డీవో చేస్తున్న కృషి అమోఘమని అన్నారు. డీఆర్డీవో శాస్త్రవేత్తల అచంచలమైన నిబద్ధత, శాస్త్రీయ నైపుణ్యం దేశ రక్షణ సన్నద్ధతకు మూలస్తంభాలని పేర్కొన్నారు.ప్రైవేట్ రంగం, విద్యాసంస్థలు, స్టార్టప్లతో కలిసి పనిచేయడం ద్వారా దేశంలో ఒక బలమైన రక్షణ పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతోందని అభినందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆవిష్కరణలపై దృష్టి సారిస్తూ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింత పెంచే మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు. నిరంతరం నేర్చుకుంటూ, భవిష్యత్ టెక్నాలజీలకు అనుగుణంగా సన్నద్ధంగా ఉండాలని డీఆర్డీవో శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa