దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలది సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. అయితే.. వరుసగా నాలుగు రోజులపాటు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు పెరిగిన విషయం తెలిసిందే. సోమవారం తగ్గినట్లే తగ్గిన కేసులు కస్తా.. మళ్లీ రికార్డు స్థాయిలో పెరిగాయి. మరణాల సంఖ్య కూడా మొదటిసారి 3వేల మార్క్ దాటి.. రెండు లక్షలు దాటింది. గత 24 గంటల్లో మంగళవారం దేశవ్యాప్తంగా 3,60,960 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 3293 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267 (1.79 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 2,01,187 కి చేరింది. ఈ మేరకు బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. కాగా.. కరోనా ప్రారంభం నాటినుంచి ఈ స్థాయిలో కేసులు మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి.
ఇదిలాఉంటే.. మంగళవారం కరోనా నుంచి 2,61,162 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,48,17,371కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 29,78,709 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా.. నిన్న దేశవ్యాప్తంగా 17,23,912 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 27 వరకు మొత్తం 28,27,03,789 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 14,78,27,367 డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మే 1 నుంచి భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. 18ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దీనిలో భాగాంగా ఈరోజు నుంచి కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా నేటినుంచి ప్రారంభమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa