ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మరోమారు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి...గుంటూరులో హాట్‌టాపిక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 11, 2021, 02:40 PM

ఏపీలో మరోమారు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. శుక్రవారంతో పదవీకాలం ముగియనున్న గవర్నర్ కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు వైసీపీ అధిష్టానం అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నలుగురు పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కి పంపినట్లు సమాచారం. వారిలో తూర్పు గోదావరి నుంచి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మోషేను రాజు,అయితే ఈ దఫా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక గుంటూరు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సారైనా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కి చోటు దక్కుతుందని భావించారు. ఊహించని విధంగా ఆయనకు మరోమారు మొండిచేయి ఎదురైంది. ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్ మర్రి రాజశేఖర్‌ని ఎమ్మెల్సీ చేసి.. మంత్రి పదవి ఇస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్ధి విడదల రజనిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. జగన్ ఆదేశాల మేరకు అంతా కలసికట్టుగా పనిచేసి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి వైసీపీ విజయం సాధించి పెట్టారు.


అప్పటి నుంచి పలుమార్లు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ మర్రికి స్థానం దక్కలేదు. గతంలో ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో మర్రి మనస్థాపానికి గురయ్యారని ప్రచారం జరిగింది. వెంటనే అధిష్టానం రంగంలోకి దిగి రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డిని ఇంటికి పంపి మరీ బుజ్జగింపు చర్యలు చేపట్టింది. అప్పటికి ఆయన మౌనంగానే ఉన్నా పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే విడదల రజనితో విభేదాలతో ఆయన అసంతృప్తికి గురవుతున్నట్లు సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.


ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పార్టీలో అసమ్మతి రాజేసే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కష్టకాలంలో జిల్లా అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపించిన మర్రిని కాదని.. గుంటూరుకు చెందిన పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డికి స్థానం కల్పించడం హాట్‌టాపిక్‌గా మారింది. సామాజికవర్గ సమీకరణాలు కూడా పనిచేశాయన్న వాదనలున్నాయి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న లేళ్ల అప్పిరెడ్డి పార్టీ పెద్దల అండదండలతో బెర్త్ దక్కించుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మర్రి ఎలా స్పందిస్తారో చూడాలి మరి!!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa