అమెరికాలోని మినియాపోలీస్లో ఫెడరల్ ఏజెంట్ కాల్పుల్లో మరణించిన అలెక్స్ ప్రెట్టీ కుటుంబం, ట్రంప్ ప్రభుత్వ వాదనను తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం చెబుతున్నవన్నీ "అసహ్యకరమైన అబద్ధాలు" అంటూ మండిపడింది. తమ కుమారుడిని పిరికిపందల్లా, హంతకుల్లా దాడి చేసి చంపారని ఆరోపించింది.ఈ నెల 24న యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్ జరిపిన కాల్పుల్లో 37 ఏళ్ల అలెక్స్ మరణించిన విషయం తెలిసిందే. అయితే, తమ కుమారుడి చేతిలో తుపాకీ లేదని, ఫోన్ మాత్రమే ఉందని అతని తల్లిదండ్రులు మైఖేల్, సుసాన్ ప్రెట్టీ తెలిపారు. అందిన కథనం ప్రకారం ఏజెంట్లు కిందకు తోసేసిన ఒక మహిళను రక్షించేందుకు అలెక్స్ ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. వీడియోలో కూడా అలెక్స్ చేతిలో ఫోన్ పట్టుకుని, మరో చేతిని పైకి ఎత్తి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.మరోవైపు, అలెక్స్ 9 ఎంఎం తుపాకీతో అధికారుల వద్దకు వచ్చి ప్రతిఘటించాడని, అందుకే ఆత్మరక్షణ కోసం ఏజెంట్ కాల్పులు జరిపారని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ప్రకటించింది. కానీ, ఈ వాదన "అర్ధరహితం" అని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ కొట్టిపారేశారు. ఘటనకు సంబంధించిన వీడియోలు చూసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా దర్యాప్తు చేస్తుందని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa