ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శం: మంత్రి ఆదిమూలపు సురేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 08, 2021, 10:12 PM

ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.కొందరు మాత్రం పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం పై బురదజల్లే కార్యక్రమాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని, ప్రజలకు వాస్తవాలు తెలుసునని ఆయన అన్నారు. ఇటీవల కొన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో ఉపాధ్యాయులచేత మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారంటూ ఉద్దేశపూర్వకంగా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో అసత్య కథనాలు ప్రచారం చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు గాను అమ్మ ఒడి కింద ఇచ్చే నగదు నుంచి వెయ్యి రూపాయల చొప్పున దాదాపు 444. 89 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 45,716 పాఠశాలల్లో ఇప్పటికే ఆయాలను నియమించడం జరిగిందన్నా300 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒకరు, 600 మంది ఉన్న పాఠశాలలో ఇద్దరు, 900 మంది ఉన్న పాఠశాలల్లో ముగ్గురు, 900 పైబడి విద్యార్థులు ఉన్న పాఠశాలలో నలుగురు చొప్పున అయాలను నియమించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఆయాలకు నెలకు 6,000 రూపాయల చొప్పున నెల జీతం చెల్లించడం జరుగుతుందన్నారు.పాఠశాలల పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి.. మరుగుదొడ్ల పరిశుభ్రతకు ప్రత్యేకంగా కెమికల్ కిట్లను కూడా సరఫరా చేస్తున్నామన్నారు. మరుగుదొడ్ల పరిశుభ్రతపై గ్రామ సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ జరుగుతుందన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడం కోసం కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం అవుతున్న సంగతి ప్రజలంతా అంగీకరిస్తున్నారని, దీనిని జిర్ణించుకోలేని కొందరు ఏవిధంగానైనా తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వానికి అప్రతిష్ట తేవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కానీ, ప్రజలంతా వాస్తవాలు తెలుసుకొని రాష్ట్రంలో అమలవుతున్న విద్యా పథకాలకు ప్రశంసలు కురిపిస్తున్నారని అన్నారు.పేద విద్యార్థుల కోసమే అమ్మ ఒడి, విద్యా దీవెన లాంటి పథకాలను సీఎం జగన్ ప్రవేశ పెట్టారని.. నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల గతిని మార్చారని గుర్తు చేశారు. అలాగే విద్యార్థులకు ఉత్తమ విద్య అందించేందుకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నామన్నారు. ప్రభుత్వం ఇలా పేద విద్యార్థుల మంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే.. విపక్షాలు మాత్రం లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని.. కేసుల ద్వారా పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa