విజయనగరం: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు జిల్లాలో రెండు ట్రౌమా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించాలని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో నిర్ణయించారు. జాతీయ రహదారిపై పూసపాటిరేగ ప్రాంతంలో, మరొకటి రామభద్రపురం, బొబ్బిలి ప్రాంతంలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సమావేశంలో తీర్మానించారు.
పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ అధ్యక్షతన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. విజయనగరానికి సమీపంలో వున్న సుంకరిపేట, పార్వతీపురంలోని మరో ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నందున ఆయా ప్రాంతాల్లో వెంటనే అధికారుల బృందాలు ఉమ్మడి తనిఖీలు నిర్వహించి తగిన నివేదికలు రూపొందించేలా నిర్ణయించారు. రహదారి భద్రత కమిటీ సమావేశంలో నిర్ణయించిన మేరకు పనులు చేపట్టేందుకు తగిన బడ్జెట్ను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరేందుకు కూడా తీర్మానించారు. ఈ సందర్భంగా ఎం. పి. మాట్లాడుతూ రహదారి భద్రత నిబంధనలు కఠినంగా అమలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గించగలమని ఈ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆటోలను లైసెన్సు లేకుండా నడపడం, ద్విచక్ర వాహనాలను యువత నిబంధనలకు విరుద్ధంగా నడపడం వంటి వాటిపై పోలీసు, రవాణా అధికారులు దృష్టి సారించాలన్నారు. కార్లలో తప్పనిసరిగా సీటు బెల్టు ధరించేలా చర్యలు చేపట్టడం, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో యువత అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ఎంతో ఆందోళనకరమని పేర్కొంటూ యువతలో ముందు అవగాహన కల్పించాలని, వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ప్రమాదాలకు తరచు కారణమవుతున్న ప్రదేశాలను గుర్తించారని, ఆయా ప్రదేశాల్లో లోపాలను సరిచేసేందుకు శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం రోడ్డు భద్రత కోసం చేపట్టే చర్యలకు ప్రజల నుంచి కూడా పూర్తి సహకారం వుండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa