ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చికెన్ బిర్యానీ మాత్రమే కాదు, ఆ వంటకాలపైనా ఆసక్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 24, 2026, 07:56 PM

తెలుగు రాష్ట్రాలలో భోజన ప్రియులు ఇష్టంగా తినే ఆహారం ఏదంటే ఠక్కున గుర్తొచ్చే సమాధానం బిర్యానీ. అందులోనూ చికెన్ బిర్యానీ అంటే ఫుడ్ లవర్స్ చెవికోసుకుంటారు. పార్టీ అయినా, ఫంక్షన్ అయినా, సందర్భం ఏదైనా సరే.. బిర్యానీ ఉండాల్సిందే, ముక్క కొరకాల్సిందే. అందుకే సర్వే ఏదైనా సరే తొలిస్థానం చికెన్ బిర్యానీదే. అయితే విజయవాడ వాసులు చికెన్ బిర్యానీతో పాటుగా మరో ఐటమ్ కూడా ఇంట్రస్టింగ్‌గా లాగిస్తు్న్నారు. చికెన్ బిర్యానీ రేంజులో కాకపోయినా.. రెండో ప్లేసు మాత్రం దానిదే. అదేంటని అనుకుంటున్నారా.. అదేనండీ తెల్లటి, మెత్తటి ఇడ్లీ..


ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రతి ఏటా.. ఏ ఐటం ఆర్డర్లు ఎన్ని వచ్చాయి.. ఏ నగరంలో ఎన్ని ఆర్డర్లు వచ్చాయనే వివరాలు వెల్లడిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే 2025 ఏడాదికి సంబంధించి విజయవాడ వాసులు ఏ ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువ పెట్టారనే విషయాలను స్విగ్గీ వెల్లడించింది. జనవరి ఒకటో తేదీ నుంది నవంబర్ 30వ తేదీ వరకూ ఈ విషయాలను వెల్లడించింది. స్విగ్గీ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. విజయవాడకు సంబంధించిన స్విగ్గీ ఫుడ్ ఆర్డర్లలో చికెన్ బిర్యానీదే తొలి స్థానం. గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి కొనసాగుతోంది. ఈసారి కూడా7.78 లక్షల చికెన్‌ బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ఇడ్లీ ఉన్నట్లు వివరించారు.


3.2 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ రెండో స్థానంలో ఉండగా,2.7 లక్షల ఆర్డర్లతో వెజ్‌ దోశ మూడో స్థానంలో ఉంది. వీటితో పాటుగా పూర్ణం బూరెలు, బొబ్బట్లు, గులాబ్ జామ్స్, బూందీ లడ్డూ వంటి వాటిని కూడా బెజవాడ వాసులు ఇష్టంగా లాగిస్తు్న్నారని స్విగ్గీ సర్వేలో తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విజయవాడ వాసులు బెంగాలీ, పంజాబీ వంటకాలవైపు మొగ్గు చూపుతున్నారట. వీటిని ఆర్డర్ చేసే వారి సంఖ్య రానురానూ పెరుగుతోందని స్విగ్గీ వెల్లడించింది. 2024తో పోలీస్తే 2025లో పంజాబీ, బెంగాలీ వంటకాలను ఆర్డర్ చేసే వారి సంఖ్య 30 నుంచి 35 శాతం వరకూ పెరిగినట్లు స్విగ్గీ తెలిపింది.


అలాగే నాన్ వెజ్ తినేవాళ్లు చికెన్ ఫ్రై, చికెన్ బర్గర్, చికెన్ పిజ్జా వంటి వాటిని స్నాక్స్ కింద ఆర్డర్ చేస్తున్నారని.. వెజ్ ప్రియుల సంగతికి వస్తే ఇడ్లీ, ఉల్లిదోశ, వడ, పూరీ, వెజ్ దోశలపై ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. మొత్తంగా విజయవాడ వాసుల అభిరుచి క్రమంగా బెంగాలీ, పంజాబీ వంటకాల వైపు మళ్లటం కూడా ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa