ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు పీఆర్సీ పై చర్చలు సుధీర్ఘంగా కొనసాగుతున్నాయి. ఇపుడిపుడే అవి ఫలఫ్రదం అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఏపీ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. పీఆర్సీ కోసం ఎంతగానో ఎదురుచూసిన ఉద్యోగులకు ప్రభుతం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. గురువారంనాడు రోజు జరిగిన సమావేశంలో ఏపీ సచివాలయంలో ఆర్థిక సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థికశాఖ ఈఓ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశమైంది. అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒకేసారి సమావేశం కాకుండా మూడు గ్రూపులుగా విభజించి ఒక్కొక్క గ్రూపుతో గంట పాటు అధికారులు చర్చించారు. అయితే పీఆర్సీ కోసం ఎంతగానో ఎదురుచూసిన ఉద్యోగులకు నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ ప్రకటించకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తు్న్నారని అన్నారు. 14.29 శాతం ఫిట్మెంట్కు తాము ఒప్పుకోలేదన్నారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తిరుపతి పర్యటనలో వారం పదిరోజుల్లో పీఆర్సీ ఇస్తామని సీఎం జగన్ చెప్పారని.. మరోసారి 72 గంటల్లో ఇస్తామని ప్రకటించారని.. అయినా ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. జనవరి 3వ తేదీన జేఏసీ సమావేశం నిర్వహిస్తామని.. అనంతరం భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. తమ ఆశలు అడిశలయ్యాయని అన్నారు. అనంతరం అమరావతి జేఏసీ చైర్మన్ బొప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగులను అవమానించడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ బిల్స్ చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగులను అవమానించడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఆదాయంలో రూ.75 వేల కోట్లు ఉద్యోగుల కోసమే ఖర్చు చేస్తున్నామని అంటున్నారని.. 32 శాతం ఖర్చు పెట్టి రాష్ట్ర బడ్జెట్ మొత్తం పెడుతున్నామని చెప్పడం సరికాదన్నారు. ఇప్పటివరకు ఏడు డీఏలు చెల్లించలేదని.. రూ.6 వేల కోట్ల డీఏ బకాయిలు ఉందన్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే.. తదుపరి కార్యచరణ ప్రకటించక తప్పదని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa