గంగా సాగర్ మేళాకు ఎటువంటి కోవిడ్ ఆంక్షలు ఉండవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. పైగా కుంభా మేళా జరిగేటప్పుడు కోవిడ్ ఆంక్షలున్నాయా..? అని ప్రశ్నించారు. గంగా సాగర్ మేళాకు ఎంతో దూరం నుంచి భక్తులు వస్తారని వారిని ఎలా ఆపగలమని అడిగారు. అదే సమయంలో మేళాను రద్దు చేయలేమని, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోని సాగర్ ద్వీపంలో 2022 జనవరి 8 నుంచి 16 వరకు గంగా సాగర్ మేళా జరుగుతుంది. ఈ మేళాకు సుదూర యూపీ, బీహార్ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మేళాకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎం మమత బెనర్జీ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులు కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. భక్తుల కార్యకలాపాలను పరిశీలించేందుకు, రద్దీని నివారించేందుకు సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లను ఉపయోగించాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రసిద్ధిగల మేళాల్లో ఇది ఒకటి. ప్రతి ఏడాదీ సంక్రాంతి సమయంలో గంగ సాగర్ మేళా వైభవంగా జరుగుతుంది. లక్షలాదిగా జనం ఈ పవిత్ర మకర సంక్రమణ సమయంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడానికి, పిండ ప్రదానాలు చేయడానికి వస్తుంటారు. అలహాబాద్లో జరిగే కుంభ మేళాకి ఎక్కడెక్కడి నుంచో నాగా సాధువులు వచ్చినట్టే ఇక్కడకు కూడా వస్తుంటారు. కాగా దేశంలోనూ మిగతా రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాళ్లోనూ కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతూనే ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa