ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీపై బీజేపీ దూకుడు దేనికి సంకేతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 11:51 PM

మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించినా బీజేపీ దాంట్లో తీవ్రతను ప్రదర్శించలేదు. కానీ ఇటీవల కాలంలో విమర్శల్లో దూకుడు పెంచుతోంది. వైసీపీయే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్ర నేతలు మొదలు జాతీయ నేతలు ఇదే బాటలో పయనిస్తున్నారు. ఈ దూకుడు వెనక ఉన్న మతలబేమిటీ అన్నదిఇపుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత గెలిచిన వైసీపీతో పాటు ఓడిన టీడీపీతోనూ సమదూరం పాటిస్తూ వచ్చిన బీజేపీ తాజాగా రూటు మార్చుకుంటోంది. వైసీపీ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలంటే ప్రధాన విపక్షంతో కలిసి సాగడమే మంచిదని భావిస్తున్న బీజేపీ నేతలు బహిరంగంగా ఆ మాట బయటపెట్టకుండానే చేయాల్సిందంతా చేసుకుని వెళ్లిపోతున్నారు. దీంతో సహజంగానే వైసీపీలో కలవరం మొదలైంది. తాజాగా సజ్జలతో పాటు ఇతర వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలే అందుకు నిదర్శనం.


పాత మిత్రుడికి దగ్గరవుతారా...?


గతంలో దూరమైనా మళ్లీ బీజేపీ దగ్గరైంది మాత్రం టీడీపీకే. గత 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీకి అంతర్గంగా సహకరించిందన్న వాదనలు ఉన్నాయి. కానీ వైసీపీకి సహకరించినా బీజేపీ నేరుగా లాభపడలేదు. కానీ టీడీపీతో గతంలో ఎపుడు పొత్తుపెట్టుకొన్నా ఆ పార్టీ అసెంబ్లీలో అడుగుపెట్టగలిగింది. దీంతో బీజేపీ తన పాత మిత్రుడు టీడీపీకి దగ్గరవుతోందా అన్న చర్చ మొదలైంది. గతంలో వాజ్ పేయ్ హయాంలో 1999లో ఏపీలో ఓసారి టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని విజయం సాధించాయి. ఆ తర్వాత ఎన్నికల్లో ఈ పొత్తు ఫలించకపోవడంతో తిరిగి ఎవరి దారు వారు చూసుకున్నారు. మరోసారి 2014లో మోడీ ఎంట్రీతో మరోసారి బీజేపీ, టీడీపీ పొత్తు కుదిరింది. అదే సమయంలో కొత్త పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తన జనసేనను కూడా వీరికి జత కలిపారు. ఫలితంగా 2014లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే మూడేళ్లలోనే ఈ పొత్తు విఫలమైంది. వైసీపీ ఒత్తిడితో కేంద్రానికి గుడ్ బై చెప్పిన టీడీపీకి తాము చేసిన తప్పిదం తెలిసి రావడానికి ఎంతో కాలం పట్టలేదు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయంలో కేంద్రం నుంచి సహకారం లేకపోవడం కూడా ప్రధాన కారణమని భావించిన టీడీపీ మళ్లీ పునరాలోచనలో పడింది. అయితే బీజేపీ కూడా అంతే వేగంగా పునరాలోచనలో పడుతుందని భావించినా అది సాధ్యం కాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa