ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోశాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం: టీడీపీ ఆరోపణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 10, 2022, 11:45 PM

గత ప్రభుత్వం హయాంలో సుమారు 500 ఎకరాల్లో గోశాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకోవడం దారుణమని అమర్‌నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు.  పలమనేరులోని టీటీడీ గోశాల నుంచి అక్రమంగా ఆవులు తరలిస్తున్నారంటూ టీడీపీ నాయకులు ఇవాళ అడ్డుకున్నారు. గోశాల నుంచి ఒంగోలుకు రైతుల పేరుతో అక్రమంగా తరలిస్తున్నారని మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని ఆరోపిస్తూ అడ్డుకున్నారు. అమర్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. దాతలు ఇచ్చిన ఆవులను అక్రమంగా తరలించి టీటీడీ గోశాలను ఇక్కడ లేకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ప్రకృతి వ్యవసాయానికి రైతులకు ఉచితంగా ఇస్తున్నామని చెబుతున్న టీటీడీ అధికారులు కనీసం రైతుకు సెంటు భూమి లేకున్నా ఎవరో పేరుతో ఉన్న పాస్ బుక్ జిరాక్స్ పెట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో సుమారు 500 ఎకరాల్లో గోశాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకోవడం దారుణమని అమర్‌నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు, భక్తులు టీటీడీ గోశాల కోసం కొన్ని కోట్ల రూపాయలు విరాళాలు అందిస్తున్నా.. గోశాలలోని పశువులను తరలించడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి పుట్టపై పాలు పోసిన గోమాతను పోషించే స్తోమత లేక రైతుల పేరుతో తరలించే చర్యలు మానుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa