కరోనా వైరస్ పలు రకాలు పలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. మరో కరోనా వేరియంట్ వస్తే ఒమిక్రాన్ కంటే శరవేగంగా వ్యాప్తి చెందే ముప్పు ఉందని, అది వ్యాక్సిన్లకు లొంగదని డబ్ల్యూహెచ్వో సాంకేతిక విభాగ చీఫ్ మరాయా వాన్ కెర్ఖోవ్ అన్నారు. ఇప్పటికే డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విజృంభించి వణికించాయి. ఇప్పుడు మరో కొత్త వేరియంట్ పుట్టుకొస్తే వాటికంటే అధిక శక్తి సామర్థ్యాలు ఆ వేరియంట్కు ఉంటాయని కెర్ఖోవ్ చెప్పారు. కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్కు రోగ నిరోధక శక్తిని ఏమార్చే గుణం అధికంగా ఉండే ముప్పు ఉంటుందని వివరించారు. ఈ కారణం వల్లే ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లకు అది లొంగకపోవచ్చని తెలిపారు. ప్రపంచం ఇటువంటి స్థితిలోకి వెళ్లకూడదని కోరుకుందామని ఆమె అన్నారు. అటువంటి కొత్త వేరియంట్లు రాకుండా కరోనాను అరికట్టాలని ఆమె అన్నారు. అలాగే, కరోనా సీజనల్ వ్యాధిగానూ రూపాంతరం చెందే అవకాశాలూ ఉన్నాయని ఆమె చెప్పారు. కరోనాను అరికట్టేంతవరకు నిబంధనలు పాటించాలని ఆమె చెప్పారు. మరోవైపు, కరోనా వ్యాప్తి అప్పుడే తగ్గినట్లు భావించకూడదని దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ హెచ్చరించారు. ఈ వైరస్ తిరగబెట్టడానికి వైరస్ మ్యుటేషన్లు కారణమని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ను తొలిసారి గుర్తించి ఆమె ప్రపంచానికి ఈ విషయాన్ని తెలిపిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ కూడా మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని తప్పించుకుని వేగంగా వ్యాప్తి చెందిందని ఆమె గుర్తు చేశారు. కరోనా మరొక వేరియంట్ రూపంలో విరుచుకుపడొచ్చని ఆమె హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ, వ్యాక్సిన్లే వేసుకోవడమే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మనముందు ఉన్న అవకాశాలని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa