కేరళలో అధికార వామపక్ష ఫ్రంట్ హింసకు వ్యతిరేకంగా భాజపా చేపట్టిన యాత్రలో పాల్గొనాల్సిన ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. వెంటనే దిల్లీకి పయనమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీతో అత్యవసర సమావేశం నేపథ్యంలో తన షెడ్యూల్ రద్దు చేసుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
భాజపా, ఆరెస్సెస్ కార్యకర్తల హత్యలకు అధికారంలో ఉన్న వామపక్ష కూటమే కారణమని ఆరోపిస్తూ భాజపా 15 రోజుల పాటు రాష్ట్రంలో జనరక్ష యాత్ర పేరిట పాదయాత్రను తలపెట్టింది. కన్నూరులో ఈ కార్యక్రమాన్ని అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ సొంత గ్రామంలో గురువారం అమిత్షా నేతృత్వంలో యాత్ర నిర్వహించాల్సి ఉండగా.. అమిత్షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. వెంటనే దిల్లీకి పయమనయ్యారు. కీలక విషయమై చర్చించేందుకు దిల్లీకి రావాలని ప్రధాని మోదీ నుంచి పిలుపురావడంతో ఆయన దిల్లీకి వెళ్లారని, అక్కడ పనులు పూర్తయ్యాక మళ్లీ యాత్రలో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖరన్ తెలిపారు.
ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే అమిత్ షా తన పర్యటన రద్దు చేసుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోలాగా ఇక్కడ కాదని, లౌకికంగా బలంగా ఉన్న కేరళలో భాజపా ఎత్తుగడలు చెల్లవంటూ కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల అన్నారు. ఈ ప్రచారాన్ని భాజపా ఖండించింది. కావాలనే విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa