ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిన నేపథ్యంలో అక్కడి భారతీయ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో ఎడ్యుకేషనల్ హబ్గా ఉన్న ఖర్కివ్కు ఏదో ముప్పు పొంచి ఉన్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఆ నగరంలోని భారత విద్యార్థులు తక్షణమే నగరాన్ని వదలాలంటూ ఉక్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకటన విడుదల చేసిన కాసేపటికే భారత రాయబార కార్యాలయం నుంచి ఖర్కివ్లోని భారత విద్యార్థులకు మరో ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనలోనూ ఖర్కివ్ను తక్షణమే వీడాలని చెప్పిన ఎంబసీ అధికారులు..వాహనాలు లేకపోయినా కాలి నడకన అయినా సరే ఆ నగరాన్ని తక్షణమే వీడాలంటూ తాజా ప్రకటనలో సూచించారు. అంతేకాకుండా, తాము సూచించిన మూడు ప్రాంతాలు పెసోచిన్, బబయే, బెజ్ల్యుడోవ్స్కాలకు ఖర్కివ్ నుంచి ఎంత దూరం ఉంటుందన్న విషయాన్ని వెల్లడించింది. ఖర్కివ్ నుంచి పెసోచిన్ 11 కిలో మీటర్ల దూరం ఉండగా.. బబయే 12 కిలో మీటర్ల దూరంలో, బెజ్ల్యుడోవ్స్కా 16 కిలో మీటర్ల దూరంలోనే ఉన్నాయని ఎంబసీ తెలిపింది. ఎలాగైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా సురక్షితంగా ఉండాలనుకుంటే.. తక్షణమే ఖర్కివ్ను వీడాల్సిందేనని ఎంబసీ అధికారులు భారత విద్యార్థులను హెచ్చరిస్తూ కేవలం నిమిషాల వ్యవధిలోనే రెండు అడ్వైజరీలు జారీ చేయడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa