మాంసాహారంలో ఒక్కో దేశంలో ఒక్కో విధానం ఉంటుంది. మన దేశంలో కేవలం చికెన్, మటన్లకే పరిమితం అయ్యాం కానీ... వేరే దేశాల్లో ప్రజలు రక రకాలైన మాంసాలను కూడా తింటు ఉంటారు. చైనాలో అయితే పిల్లులు, కుక్కలతో సహా అన్ని ఆరగిస్తారు. అయితే ఏ దేశాలు వన్యమృగాలు జోలికి వెళ్లవు. వాటిని వేటాడం, తినడం చట్టవిరుద్ధం. అలా ఎవరైనా తింటే జైలు శిక్ష తప్పదు. అయితే ఇప్పుడు ఓ సంస్థ మాత్రం సింహం, పులి, జీబ్రా మాంసాలను అందించడానికి సిద్ధమైంది. దీంతో ఇకపై వాటితో తయారు చేసే పదార్థాలు మనముందు ఉండనున్నాయి. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా..? దీనికి లండన్ కేంద్రంగా పనిచేసే ప్రిమేవల్ ఫుడ్స్ అనే సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ.. జంతువుల జోలికి వెళ్లకుండా ల్యాబ్లోనే వన్యమృగాల మాంసాన్ని తయారు చేయడానికి రెడీ అయింది. ఆ మాంసాలతో టైగర్ స్టిక్స్, జీబ్రా సుషీ రోల్స్ తయారు చేస్తారు. అలాగే ఎలిఫెంట్ ఆయిల్ను కూడా ఉత్పత్తి చేయనున్నారు. ఈ మాంసాలతో రకరకాల పదార్థాలు చేసి లండన్ రెస్టారెంట్లలో వడ్డించనున్నారు. స్థానిక మార్కెట్లు, సూపర్ మార్కెట్లలో కూడా విక్రయించనున్నారు. ప్రజలు ఇప్పుడు కొత్తదనం కోసం తహతహలాడుతున్నారని, వారి కోసమే ఇతర జంతువుల మాంసాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నామని ప్రిమేవల్ ఫుడ్స్ పెట్టుబడిదారి సంస్థ అయినా ఏస్ వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ యిల్మాజ్ బోరా చెప్పారు. ఇదిలావుంటే త్వరలో ఈ సంస్థ ఫుడ్ఫెస్టివల్ను కూడా నిర్వహించనుంది. అక్కడ సింహం, పులి, ఏనుగు, జిరాఫీ మాంసాలతో వంటకాలను చేసి పెట్టనున్నారు. ఆ వంటకాల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి లండన్లో ఒక టేస్టింగ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్టు యిల్మాజ్ బోరా చెప్పారు. దీనికి సంబంధించి ఓ మెనూను కూడా విడుదల చేశారు. కాగా ల్యాబ్లో మాంసం అభివృద్ధి చేసే పద్ధతి కొత్తదేం కాదు. జంతువుల కణాలను ప్రాసెస్ చేసి పరిశోధనశాలలోనే తయారు చేసిన చికెన్, మటన్ వంటివి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. ఈ రంగంలో మరింత లాభాలను పొందేందుకు ప్రిమేవల్ ఫుడ్స్ ఇలాంటి ఆలోచన చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa