ఇటీవల కేంద్రం ప్రభుత్వం స్వచ్చంధ సంస్థల విదేశీ నిధులపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. ఈ చర్యలను సుప్రీం కోర్టు సమర్థించింది. దేశంలో ఏ స్వచ్ఛంద సేవా సంస్థకైనా నిధులే ఆలంబన. ముఖ్యంగా, విదేశాల నుంచి వచ్చే నిధులతో అనేక సేవా సంస్థలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) విదేశాల నుంచి నిధులు తెచ్చుకోవాలంటే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్ సీఆర్ఏ) అనుమతులు తప్పనిసరి. అయితే, దేశంలో అనేక స్వచ్ఛంద సంస్థలు విదేశీ నిధులతో దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నాయని కొంతకాలంగా కేంద్రం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో 6 వేలకు పైగా ఎన్జీవోలకు ఎఫ్ సీఆర్ఏ అనుమతులను పునరుద్ధరించలేదు. కేంద్రం వేటును ఎదుర్కొన్నవాటిలో అనేక ప్రసిద్ధ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఉన్నాయి.
తాజాగా, ఎన్జీవోలకు విదేశీ నిధులపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించింది. ఎఫ్ సీఆర్ఏ చట్టానికి కేంద్రం చేసిన సవరణలకు మద్దతు పలికింది. గతంలో నిధుల దుర్వినియోగం, అవాంఛనీయ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే ఇలాంటి కఠిన వైఖరి తప్పనిసరి అంటూ జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్ లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. నోయెల్ హార్పర్, జీవన్ జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2021 నవంబరు 9న తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఎన్జీవోలకు అందే నిధులపై కేంద్రం కఠినమైన, మితిమీరిన నిబంధనలు విధిస్తోందని నాడు పిటిషన్ దాఖలైంది. తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇకమీదట కొత్త నిబంధనలు వర్తిస్తాయని, ఎన్జీవోలు విదేశీ నిధులు వినియోగించడంపై జవాబుదారీతనానికి ఇది ఉపకరిస్తుందని త్రిసభ్య బెంచ్ పేర్కొంది. అంతేకాకుండా, విదేశీ నిధులు అందుకోవడం ఓ కచ్చితమైన హక్కు అని భావించలేమని స్పష్టం చేసింది. దేశ సామాజిక, ఆర్థిక స్వరూపం, రాజకీయాలపై విదేశీ నిధులు నిర్మాణాత్మక ప్రభావాన్ని చూపుతాయని జడ్జిలు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa