ఇపుడు అందరి నోళ్లలో ఎలక్ట్రికల్ కార్ల గురించి చర్చ సాగుతోంది. దీనికి కారణం పెట్రోల్, డీజిల్ ధరల మోత కొనసాగుతూ ఉండటమే. ధరలు ఆకాశాన్ని తాకాయి. లీటరు పెట్రోల్ కొనాలంటే రూ.120 చెల్లించుకోవాలి. అదే డీజిల్ అయితే రూ.100కు పైనే ఇవ్వాలి. దీంతో వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ బాదుడును భరించడం కన్నా ఎలక్ట్రిక్ వెహికల్కు మారిపోవడం మంచిదని ఇప్పటికే చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. మీరు కూడా ఇదే ఆలోచనలో ఉంటే.. బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని మీకు నచ్చిన ఇ-వెహికల్ను కొనుగోలు చేయొచ్చు. ఎస్బీఐ సహా పలు రకాల బ్యాంకులు ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయడానికి రుణాలు అందిస్తున్నాయి. అది కూడా ఈ తరహా రుణాలపై ప్రత్యేకమైన వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఏ ఏ బ్యాంకుల్లో ఎలక్ట్రిక్ కారు రుణాలపై ఎంత వడ్డీ రేట్లు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
ఎస్బీఐ గ్రీన్ లోన్
ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ కొనుగోలును ప్రోత్సహించడానికి స్టేట్ బ్యాంక్.. గ్రీన్ కార్ లోన్ అందిస్తోంది. సాధారణ వెహికల్ రుణాల కన్నా ఈ స్కీమ్ కింద 20 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీకి లోన్ పొందొచ్చు. కారు ఆన్రోడ్ ధరలో 90 నుంచి 100 శాతం వరకు ఫైనాన్స్ ఇస్తోంది. వెహికల్ ప్రాతిపదికన ఈ మొత్తం మారొచ్చు. వడ్డీ రేటు 7.05 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.
యూనియన్ గ్రీన్ మైల్స్
ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈవీ రుణాలు అందిస్తోంది. యూనియన్ బ్యాంక్ గ్రీన్ మైల్స్ స్కీమ్ కింద ఈ సదుపాయం కల్పిస్తోంది. ఇ-టూవీలర్ లేదా ఇ-కారు ఏదైనా కొనొచ్చు. తీసుకున్న రుణాన్ని 84 నెలలలోగా ప్రతి నెలా ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లలో 20 బేసిస్ పాయింట్ల తగ్గింపు లభిస్తుంది. సిబిల్ స్కోర్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారతాయి. లోన్పై వడ్డీ రేటు 7.4 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.
యాక్సిస్ న్యూ కార్ లోన్
ఈ బ్యాంక్ కూడా ఉద్యోగులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనేందుకు రుణాలు అందిస్తోంది. ఆన్రోడ్ ధరలో 85 శాతం వరకు ఫైనాన్స్ లభిస్తుంది. 7 ఏళ్ల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. హైదరాబాద్, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో యాక్సిస్ బ్యాంక్ ఈవీ రుణాలు ఆఫర్ చేస్తోంది. సాధారణ కారు రుణాలతో పోలిస్తే ఈవీ కారు కొనేందుకు లోన్ తీసుకుంటే 50 బేసిస్ పాయింట్ల మేర తక్కువ వడ్డీ రేటుకే రుణం పొందొచ్చు.
పన్ను మినహాయింపు
ఈవీ లోన్ తీసుకుంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈబీ కింద మొత్తంగా 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. 2020-21 అసెస్మెంట్ ఇయర్ నుంచి ఈ ప్రయోజనం లభిస్తోంది. కారు లేదా బైక్, స్కూటర్ ఇలా మీకు నచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే ఈ బెనిఫిట్ ఉంటుంది. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31లోపు లోన్ తీసుకుంటేనే ఈ ప్రయోజనం పొందగలం. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసిన వారికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి కూడా మినహాయింపు లభిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa