పాక్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ప్రతిపక్షాలు పాక్ నేషనల్ అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా శనివారం రాజకీయ హైడ్రామా నెలకొంది. అర్ధరాత్రి వరకు సాగిన ఉత్కంఠ పరిణామాల మధ్య అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. 342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 174 ఓట్లు పడ్డాయి. ఇమ్రాన్ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ సభ్యులు కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. సభలో వారంతా వాకౌట్ చేశారు. ఇప్పటికే పదవీ గండంపై అంచనాకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయన తన క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్ కూడా ఇమ్రాన్ ఖాన్తో సమావేశమయ్యారు. ఆ వివరాలు బయటకు పొక్కలేదు. ఇక పాక్ ప్రధానిగా ప్రతిపక్షాలు బలపర్చిన పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ (నవాజ్ షరీఫ్ సోదరుడు) పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఏ క్షణమైనా ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే ఇదంతా విదేశీ శక్తుల కుట్రగా ఇమ్రాన్ ఖాన్ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa